CJI Chandrachud: ప్రధాని మా ఇంటికి రావటం తప్పేమీ కాదు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
గణపతి పూజ సందర్భంగా ప్రధాని మోదీ తన ఇంటికి రావటంలో తప్పేమీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రధాని మోదీని తన ఇంటికి ఆహ్వానించటంపై విమర్శలు చేస్తున్నవాళ్లను ఉద్దేశించి సీజేఐ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రెండు వ్యవస్థల బలోపేతం కోసం జరిగే చర్చల్ని గౌరవించాలని, అధికార విభజన ఉన్నంత మాత్రాన కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థకు చెందిన ఇద్దరు కలుసుకోకూడదని ఏమీ లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంశాల్లో రాజకీయ పరిణతి చూపాల్సిన అవసరముందన్నారు. ‘గణపతి పూజ కోసం మా ఇంటికి ప్రధాని వచ్చారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య తరుచూ సమావేశాలు జరుగుతుంటాయి. గణతంత్ర దినోత్సవం వేళ రాష్ట్రపతి భవన్లో కలుసుకుంటాం. ఇదీ అలాంటిదే. మం త్రులు, ప్రధానితో జరిగే సమావేశాల్లో కేసుల ప్రస్తావన రాదు’ అని అన్నారు.
అయోధ్య తీర్పునకు ముందు దేవుడిని ప్రార్థించడంపై సీజేఐ స్పందిస్తూ.. తాను అన్ని మతాలపై గౌరవం, విశ్వాసం ఉన్న వ్యక్తినని చెప్పారు. రాజకీయాల్లో పరిణితి అవసరమని.. న్యాయమూర్తులపై దుష్ర్పచారం చేయడమంటే వ్యవస్థను కించపరచడమేనన్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గురించి మాట్లాడుతూ.. తీవ్ర ఘర్షణ సమయాల్లోనూ చిరునవ్వు చిందించే వ్యక్తి అంటూ కొనియాడారు.
ఇదిలాఉంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్న ఫొటోలను ప్రధాని సామాజిక మాధ్యమ ఖాతాలో అప్పట్లో పోస్ట్ చేయడంపై పలు విపక్షాలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సీజేఐ తాజాగా స్పందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com