Madhya Pradesh: అత్యాచార బాధితురాలి నరకయాతన.. స్పందించని జనం

Madhya Pradesh:  అత్యాచార బాధితురాలి నరకయాతన.. స్పందించని జనం
సహాయం కోసం 8 కిలోమీటర్లు..2 గంటలు..రక్తస్రావంతో

మనుషులలో మానవత్వం మాత్రం లేదని మరోసారి తెలిసి వచ్చేలా చేసే ఓ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో జరిగింది. ఓ బాలిక, అత్యాచార బాధితురాలు గాయాలతో, తీవ్ర రక్త స్రావంతో రోడ్డుపైకి వచ్చింది. సాయం చేయాలంటూ కనిపించిన ప్రతి గుమ్మాన్ని, వ్యక్తిని కోరింది. కానీ, పోపో అంటూ చేతులు దులిపేసిన వారే కానీ సాయం చేసే వారు కనిపించలేదు. ఒంటిమీద సరైన బట్టలు లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డుపై 8 కిలోమీటర్లు తిరుగుతూ కనపడినవారినల్లా వేడుకుంది. ఆమెను చూడడానికి ఎగబడిన జనానికి ఆమెకు బట్టలు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేకపోయింది. ఆఖరికి ఆ స్థానికులు కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు.


మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా మహాకాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకున్న బాలిక అర్థ నగ్నంగానే సాయం కోసం రోడ్డు వెంట పరుగులు పెట్టింది. ఎనిమిది కిలోమీటర్లు, 2 గంటలపాటు కనిపించిన ప్రతి గుమ్మాన్ని, ప్రతి మనిషినీ సహాయం కోసం వేడుకుంది. అందరూ ఓ ప్రదర్శన చూసినట్టు చూశారే గానీ కప్పుకోవడానికి ఒక తువ్వాలు కూడా ఇవ్వలేదు. ఓ వ్యక్తి అయితే సాయం కోరుతున్న బాలికను తరిమి కొట్టడం కనిపించింది. ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ బాలిక చివరికి ఉజ్జయినిలోని బద్ నగర్ ఏరియాలోని ఓ ఆశ్రమం దగ్గరకు వెళ్లింది. అక్కడి ఆశ్రమ నిర్వాహకులు ఆమెకు దుస్తులు ఇచ్చి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తీవ్ర గాయాలు అయినట్టు, అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. రక్తం కావాల్సి ఉండడంతో ఇండోర్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఘటనపై ఉజ్జయిని ఎస్పీ తెలిపారు.


గుర్తు తెలియని వ్యక్తులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు. బాలిక తల్లిపైనా దాడి జరిగినట్లు సమాచారం ఉందని, వారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. బాలిక పట్ల స్థానికుల ప్రవర్తించిన తీరు పట్ల ఎస్పీ విస్మయం వ్యక్తం చేశారు. రక్తస్రావం, అర్థనగ్నంగా ఓ బాలిక రోడ్డు సాయం కోసం అర్థిస్తున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనీసం పోలీసులకైనా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story