Uttarakhand Tunnel : ఉత్తరకాశీలో కార్మికుల కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐదు దాటి ఆరు రోజులు కావొస్తున్నా వారిని బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలు సఫలం కావడం లేదు. దీంతో థాయ్లాండ్, నార్వేకు చెందిన ఎలైట్ రెస్క్యూ బృందాలతో పాటు అమెరికన్ ఆగర్ మిషన్ను రంగంలోకి దింపారు. ఇప్పటి వరకు 24 మీటర్ల వరకు శిథిలాలను తొలగించిన అధికారులు.. బాధితులకు పైపుల ద్వారా కార్మికులకు ఆక్సిజన్, నీరు, ఆహారం అందిస్తున్నారు.
అయితే పెద్దగా పగుళ్ల శబ్దం వినిపించడంతో శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు రెస్క్యూ పనులు నిలిపివేసినట్టు జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీసీఎల్) ప్రకటించింది. పనులు చేసే మార్గం బ్లాక్ అయ్యిందని, దీంతో డ్రిల్లింగ్ పనులు నిలిపివేసినట్టు వెల్లడించింది. సొరంగం లోపల రెస్క్యూ పనుల్లో ఉన్నవారికి పగుళ్ల శబ్దం పెద్దగా వినిపించిందని, ఈ పరిణామంతో సొరంగంలో పని చేస్తున్న బృందంలో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొంది. సొరంగం మరింత కూలడానికి ఎక్కువ అవకాశాలు ఉండడంతో లోపలికి పైప్ నెట్టే కార్యక్రమాలను నిలిపివేసినట్టు వివరించింది. పరిస్థితిపై నిపుణులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది.
ఆదివారం ఈ సొరంగం కూలడంతో 40 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి శిథిలాల తొలగింపు చేపట్టిన రెస్క్యూ బృందాలు.. ఇప్పటి వరకు 24 శిథిలాలను తొలగించాయి. నాలుగు పైపుల ద్వారా టన్నెల్లో ఉన్న కార్మికులకు ఆహారం, నీరు, ఆక్సిజన్ అందిస్తున్నారు.
సహాయక చర్యలు ముమ్మరం చేసే ప్రక్రియలో భాగంగా అమెరికర్ ఆగర్ మిషన్ను ఉపయోగిస్తున్నారు అధికారులు. ఇది గంటకు 5 మీటర్ల బండరాళ్లను తొలగిస్తుంది. మరోవైపు.. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా 50 మీటర్లకంటే ఎక్కువ పొడవున్న పైపులను శిథిలాల గుండా టన్నెల్లోకి పంపిస్తున్నారు. వీటి ద్వారా కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అయితే… దాదాపు ఐదు రోజులుగా కార్మికులు టన్నెల్ లోపలే ఉండిపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు. అంతేకాదు.. భూగర్భంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అపస్మారక స్థితికి కూడా చేరే అవకాశముందని చెబుతున్నారు. ఆపరేషన్ చేపడుతుండగా విరిగిపడుతున్న కొండచరియలు పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. ముఖ్యంగా మార్గం బ్లాక్ అవుతుండడం ఇబ్బందికరంగా మారుతోంది. 2018లో థాయ్లాండ్లోని గుహలో చిక్కుకున్న పిల్లలను విజయవంతంగా రక్షించిన వారితోసహా, నార్వే ఎలైట్ రెస్క్యూ టీమ్లు ఆపరేషన్ చర్యల్లో పాల్గొన్నాయి. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, ఐటీబీపీతోపాటు పలు ఏజెన్సీలకు చెందిన 165 మంది సిబ్బంది 24 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com