Opal Suchata: మిస్ వరల్డ్ 2025 కిరీటం థాయ్లాండ్ సుందరి సొంతం..

ప్రపంచ సుందరి కిరీటాన్ని థాయ్లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్శ్రీ సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ 72వ విజేతగా ఒపాల్ సుచతా చువాంగ్శ్రీ నిలిచింది. ఒపాల్ సుచతా చువాంగ్శ్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు. ఇక రన్నరప్గా ఇథియోపియా భామ నిలిచింది. మూడో స్థానంలో పోలెండ్, నాల్గో స్థానంలో మార్టినిక్ భామ నిలిచింది.
పంచ సుందరి 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు మొత్తం 108 దేశాల అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. ఇందులో 16 మంది క్వార్టర్స్కు ఎంపికయ్యారు. చివరి రౌండ్లో అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఫైనల్కు వచ్చిన నలుగురిలో తుది ప్రశ్న ద్వారా న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ విజేతను ప్రకటించారు. మొత్తానికి థాయ్లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్శ్రీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, మెయిన్ స్పాన్సర్ల ద్వారా ఈ ప్రైజ్ మనీ అందించారు.
ప్రపంచ సుందరి-2025 ఫైనల్ పోటీలు హైదరాబాద్లోని హైటెక్స్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, టాలీవుడ్, బాలీవుడ్, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం 3,500 మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక న్యాయ నిర్ణేతలుగా నటుడు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లార్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com