Parliament session: రాత్రంతా ఎంపీల ఆందోళన

Parliament session: రాత్రంతా ఎంపీల ఆందోళన
పార్లమెంట్‌ ఆవరణలో రాత్రంతా ప్రతిపక్ష ఎంపీల మౌన దీక్ష... మణిపుర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మణిపుర్‌(( Manipur)లో మహిళలను నగ్నంగా(Manipur' placards) ఊరేగించిన అమానవీయ ఘటనపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు(Opposition MPs) ఆందోళన చేస్తున్నాయి. సోమవారం కూడా ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో అట్టుడికాయి. ప్రతిపక్ష నాయకుల నినాదాలతో రాజ్యసభ, లోక్‌సభ హోరెత్తాయి. వారి ఆందోళనలతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ప్రధాని మోదీ సభ వెలుపల ప్రకటన చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాజ్యసభలో అనైతికంగా ప్రవర్తించారని ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు. ఈ ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.


మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష ఎంపీలు(opposition MPs)... రాత్రి వేళ కూడా నిరసన(Night Protest) వ్యక్తం చేశారు. పార్లమెంట్ హౌస్ లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట... "ఇండియా ఫర్ మణిపుర్ " ప్లకార్డులు పట్టుకుని ఆప్, కాంగ్రెస్ ఎంపీలు రాత్రంతా మౌన దీక్ష చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీ సంజయ్‌ సింగ్‌తో పాటు ఇతర నేతలు సోమవారం రాత్రంతా ఆందోళనలు కొనసాగించారు. సమయ పరిమితులు లేకుండా..మణిపుర్ అంశాన్ని ఉభయ సభల్లో చర్చించాలని ప్రతిపక్ష 'ఇండియా' కూటమి డిమాండ్ చేస్తోంది. మణిపుర్ ఆందోళనలపై... ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన ఇవ్వాలని కోరుతోంది.


మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్ బయట మాట్లాడుతున్నారని సభలో ఆ విషయాన్ని చర్చించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్షాలు చర్చకు సిద్ధంగా ఉన్నాయని, అన్ని పార్టీలు మాట్లాడేందుకు వీలుగా చర్చ జరగాలన్నారు. సభలో కాకుండా పార్లమెంట్ బయట మణిపుర్ అంశాన్ని చర్చించడం, సభకు అవమానకరం అని విమర్శించారు. రూల్‌ 267 ప్రకారం మణిపూర్‌ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చేందుకు వెనకాడుతున్నారని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ముఖ్యమైన అంశంపై చర్చించకుండా.. ప్రతిపక్షాలు సభ నుంచి పారిపోతున్నాయని ఆరోపించింది. సభలో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేసిన తర్వాత కూడా విపక్షాలు ఆందోళన చేయడాన్ని అధికార బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రతిపక్షాలు సాకులు చెప్పి చర్చ నుంచి తప్పించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ విమర్శించారు. గురువారం వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా ఇప్పటివరకూ సభ కార్యకలాపాలు సాగలేదు.

Tags

Read MoreRead Less
Next Story