Pakistan : పబ్జీ ప్రేమకు మించిన కథ...ఫేస్ బుక్ లవ్..

Pakistan :  పబ్జీ ప్రేమకు మించిన కథ...ఫేస్ బుక్ లవ్..
ప్రియుడి కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ

ప్రేమకు హద్దులు లేవని మనం విన్నాం. కానీ గత కొంతకాలంగా వాటిని విపరీతంగా చూస్తున్నాం. ఇటీవల సరిహద్దులు దాటుతున్న ప్రేమకు సోషల్ మీడియా తనవంతు సహాయం చేస్తోంది. ప్రేమించిన వారి కోసం ఏకంగా దేశాలే దాటుతున్నవారు ఇప్పుడు వారానికి ఒకరు బయట పడుతున్నారు.కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే మహిళ తన నలుగురు పిల్లలతో పబ్జీలో పరిచయమై యువకుడి కోసం అక్రమంగా ఉత్తరప్రదేశ్ వచ్చిన వార్త ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే తాజాగా ఇప్పుడు అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా ఖాన్ కలవడానికి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఫ్రావిన్స్ లోని దీర్ సిటీకి చేరుకుంది.

వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజుకు, 29 ఏళ్ల నస్రుల్లా ఖాన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. అల్వార్ జిల్లాలోని భివాడి ప్రాంతానికి చెందిన అంజుకి 2007 లో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుమార్తె వయస్సు 15 ఏళ్లు కాగా.. కుమారుడికి 6 ఏళ్లు.


అంజు, ఆమె భర్త అరవింద్ అల్వార్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు. అంజుకి పేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు నస్రుల్లా. ఇప్పుడు అంజు నస్రుల్లాను కలుసుకోవడానికి గత గురువారం వూయువ్య పాకిస్థాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ లో ఉన్న అప్పరి దిర్ జిల్లాకు వెళ్లింది. ఆమెను పాక్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంజుకు పాస్ పోర్ట్, వీసా, అన్ని పత్రాలు సరిగా ఉండడంతో విడిచిపెట్టారు.

నస్రుల్లా గతంలో పాఠశాల ఉపాధ్యాయుడు, కానీ ప్రస్తుతం మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. ఇక అంజు గురువారం రాజస్థాన్ చూడడానికి వెళుతున్నానని భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి భర్తకు ఫోన్ చేసి తాను లాహోర్ లో ఉన్నట్టు చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. అయితే రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి ఆమె ఫోన్ ముగించింది. అంజు భర్త కూడా ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టు కనపడట్లేదు. ఆమె స్నేహితుడిని కలవడానికి వెళ్ళింది కాబట్టి తన తిరిగి వస్తుందని అనుకుంటున్నాడు. అయితే మీడియా సమాచారం ప్రకారం అంజు అక్కడ వాడటానికి వేరొక కొత్త సిమ్ కార్డుని తీసుకుంది. కానీ ఆ విషయం భర్తకు తెలియజేయక పోవటం, రాజస్థాన్ వెళ్తున్నానని చెప్పి పాకిస్తాన్ కు వెళ్లడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇక ఈ మధ్యకాలంలో సరిహద్దులు దాటిన ప్రేమకథ సీమ హైదర్ స్టోరీ మనందరికీ తెలుసు. 2019లో పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే మహిళ వచ్చారు. ఆమె తనతో పాటు తన నలుగురు పిల్లలను వెంట పెట్టుకుని సరిహద్దులు దాటింది. కానీ సీమ విషయం లో ఇంకా చాలా అనుమానాలు తీరనేలేదు.

Tags

Read MoreRead Less
Next Story