Kashmir: కశ్మీర్లో దాడులకు లష్కరే, జైషే ఉగ్రవాదుల ప్లాన్

జమ్మూకశ్మీర్లో మరోసారి భారీ ఉగ్రదాడులకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నాయని తాజా నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ముగిసి ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో ప్రతీకార దాడుల కోసం పాక్ ఉగ్రవాదులు మళ్లీ సమీకృతం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహమ్మద్ (జేఈఎం) వంటి సంస్థలు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని చేరవేశాయి.
నిఘా వర్గాల నివేదిక ప్రకారం సెప్టెంబర్ నుంచి ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. చొరబాట్లు, రెక్కీ, సరిహద్దుల వెంబడి ఆయుధాల సరఫరాను పెంచారు. పాకిస్థాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ఎస్జీ), ఐఎస్ఐ సహకారంతో పలు లష్కరే, జైషే బృందాలు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి కశ్మీర్లోకి ప్రవేశించినట్లు తెలిసింది. షంషేర్ అనే లష్కరే ఉగ్రవాది నేతృత్వంలోని ఒక బృందం డ్రోన్ల సాయంతో ఏరియల్ రెక్కీ నిర్వహించి, నియంత్రణ రేఖ వద్ద బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించినట్లు సమాచారం. ఇది సమీప భవిష్యత్తులో ఆత్మాహుతి దాడులకు లేదా ఆయుధాల జారవిడతకు సంకేతమని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) వ్యాప్తంగా పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్స్ (బీఏటీఎస్)ను తిరిగి మోహరించారు. ఈ బృందాల్లో మాజీ ఎస్ఎస్జీ సైనికులు, ఉగ్రవాదులు ఉంటారు. ఇది భారత సైనిక స్థావరాలపై సరిహద్దు దాడులకు పాల్పడే ప్రమాదాన్ని సూచిస్తోంది. అక్టోబర్ 2025లో పీవోకేలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్, ఐఎస్ఐ సీనియర్ అధికారులు పాల్గొన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సమావేశాల్లో నిద్రాణంగా ఉన్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ను పునరుద్ధరించడం, మాజీ కమాండర్లకు నెలవారీ జీతభత్యాలు ఇవ్వడం, 'ఆపరేషన్ సిందూర్' నష్టాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడైంది.
ఈసారి ఉగ్రవాదులు కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. కశ్మీర్ లోయలో స్థానిక సానుభూతిపరులు, సహాయకుల వివరాలను లష్కరే తోయిబా సేకరిస్తోంది. తద్వారా తమ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను మళ్లీ బలోపేతం చేసుకుంటోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడం కోసం నార్కో-టెర్రర్, ఆయుధాల స్మగ్లింగ్ మార్గాలను కూడా విస్తరిస్తున్నట్లు సమాచారం.
జమ్మూకశ్మీర్లో స్థానిక ఎన్నికలు, పర్యాటకం పుంజుకోవడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడానికే ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద నెట్వర్క్ ప్రయత్నిస్తోందని భద్రతా ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.
ఈ నిఘా సమాచారాన్ని 'కీలక హెచ్చరిక'గా పరిగణిస్తున్నామని, ఉత్తర కమాండ్ సెక్టార్లలో భారత సైన్యం, నిఘా వర్గాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ తన ఉగ్రవాద ఎగుమతిని ఆపకపోతే, 'ఆపరేషన్ సిందూర్' మరో దశకు వెళ్లే అవకాశం ఉందని సంకేతాలిచ్చాయి. చలికాలం సమీపిస్తున్న వేళ పాక్ దూకుడు కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

