Parliament : నేటి నుంచే పార్లమెంట్‌ సమావేశాలు..

Parliament : నేటి నుంచే పార్లమెంట్‌ సమావేశాలు..
అస్త్రశస్త్రాలతో సిద్ధమైన ఎన్డీఏ, ఇండియా ఫ్రంట్‌

ప్రతిపక్షాలు ఇండియాతో నూతన కూటమి ప్రకటించిన వేళ.. అధికార భాజపా పాత మిత్రులను ఏకం చేసిన సమయాన నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఇండియా’ పేరిట కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో ఉమ్మడిగా అంశాలు లేవనెత్తనున్నాయి. ముఖ్యంగా మణిపూర్‌ అల్లర్లు, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గవర్నర్ల వ్యవస్థ వంటి అంశాలను లేనెత్తాలని ఇప్పటికే నిర్ణయించాయి. అయితే, కేంద్రం తీసుకొస్తున్న ఢిల్లీ సర్వీసుల ఆర్డినెన్సు బిల్లును అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిపై పార్లమెంటు రణరంగంగా మారే అవకాశముంది.

పార్లమెంట్‌లో పరస్పరం ఇరుకునపెట్టే వ్యూహాలకు రెండు శిబిరాలూ పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మణిపుర్‌ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి, దిల్లీ ఆర్డినెన్సు, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, సరిహద్దులో పరిస్థితులు వంటి ఇతర అంశాలూ చర్చకు వచ్చేలా చూడాలని, దానిపై వ్యూహరచనకు ప్రతిరోజూ సమావేశం కావాలని ప్రతిపక్ష శిబిరం నిర్ణయించింది. ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో కొనసాగే సమావేశాల్లో 32 అంశాలను సభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

తొలిరోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిల్లీ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, TMC, డీఎంకే సభ్యులు సమర్పించిన నోటీసులను లోక్‌సభ సచివాలయం అనుమతించింది. కొత్తగా ఏర్పాటైన విపక్ష కూటమి ఇండియా నేడు తొలిసారి సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని చర్చించడానికి రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో భేటీ నిర్వహించనున్నారు.

నిన్న అఖిలపక్ష సమావేశానికి 34 పార్టీల నేతలు హాజరై తమ డిమాండ్లను వినిపించారు. మణిపుర్‌ పరిస్థితులపై మొదటిరోజే ప్రధానమంత్రి ప్రకటన చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కులగణన, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి అంశాలపై.. చర్చ గురించి వివిధ పార్టీలు డిమాండ్‌ చేశాయి. ప్రతి అంశంపై చర్చించడానికి..... తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి.ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. మణిపుర్‌ అంశంపై చర్చకు సభాపతి ఎప్పుడు తేదీ నిర్ణయిస్తే అప్పుడు చర్చిస్తామని ప్రధానమంత్రి ప్రకటన కోసం విపక్షాలు డిమాండ్‌ చేయడం సభలో గందరగోళం సృష్టించడానికి ఒక సాకు మాత్రమేనని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story