Partha Chatterjee: మంత్రి పార్థ ఛటర్జీపై వేటు.. పదవి నుండి తొలగింపు..
Partha Chatterjee: పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో మంత్రి పార్థా ఛటర్జీపై వేటు పడింది.. మంత్రి సహాయకురాలు అర్పితా ముఖర్జీకి చెందిన ఫ్లాట్లలో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడటం, ఈ వ్యవహారం పశ్చిమబెంగాల్లో పెద్ద దుమారమే రేపడంతో ఎట్టకేలకు సీఎం మమత బెనర్జీ స్పందించారు.. మంత్రి పదవి నుంచి పార్థ ఛటర్జీని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు..
మొదట కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత వేటు వేయాలని భావించినప్పటికీ.. ఎలాంటి చర్చా లేకుండానే వేటు వేసినట్లు టీఎంసీ వర్గాలు చెప్పాయి. మంత్రి పదవి నుంచి పార్థ ఛటర్జీని తప్పించడంతో వాణిజ్య, పారిశ్రామిక శాఖతోపాటు ఐటీ శాఖ బాధ్యతలను కూడా మమతే చూసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన టీఎంసీ సెక్రటరీ జనరల్గా ఉండగా.. ఆ పదవి నుంచి కూడా పార్థను తప్పిస్తారని తెలుస్తోంది.
అటు అర్పిత ముఖర్జీకి చెందిన రెండో ఫ్లాట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి.. 29 కోట్ల వరకు నగదు నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు.. కేజీల కొద్దీ బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.. నిన్న మధ్యాహ్నం మొదలైన సోదాలు ఇవాళ ఉదయం వరకు కొనసాగాయి.. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో మొత్తం 50 కోట్లకుపైగా నగదును ఈడీ సీజ్ చేసింది.
పది పెద్ద పెద్ద బాక్సుల్లో నగదును తరలించారు అధికారులు. సోదాల్లో దొరికిన డబ్బును లెక్కబెట్టేందుకు మూడు కౌంటింగ్ మెషీన్లు వినియోగించాల్సి వచ్చింది.. అటు ఈ దొరికిన సొమ్మంతా పార్థ ఛటర్జీదేనని ఈడీ అధికారులకు అర్పిత ముఖర్జీ స్పష్టంగా చెప్పారు.. తన ఫ్లాట్ను పార్థ ఛటర్జీ వినియోగించుకునే వారని చెప్పింది.. ఇక ఈ కేసులో ఇప్పటికే పార్థ ఛటర్జీతోపాటు అర్పితను కూడా ఈడీ అధికారులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను కూడా ఈడీ విచారిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com