MODI: ఏకాభిప్రాయం మేరకే అన్ని నిర్ణయాలు

మూడో విడత ప్రభుత్వంలో ఏకాభిప్రాయం మేరకే అన్ని నిర్ణయాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అన్నింటి కంటే దేశమే ముందు అన్న సూత్రం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని NDA పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా భాగస్వామ్యపక్షాలకు భరోసా ఇచ్చారు. గత పదేళ్ల NDA పాలన ట్రైలర్ మాత్రమేనన్న మోదీ దేశాభివృద్ధికి మరింత కష్టపడి పనిచేయనున్నట్లు వివరించారు. NDA అనేది అధికారం కోసం కలిసి వచ్చిన పార్టీల సమూహం కాదన్న మోదీ దేశం ముందు" అనే సూత్రానికి కట్టుబడి ఉన్న సహజ మిత్రుల కూటమి అని పేర్కొన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు లాంఛనాలు పూర్తయ్యాయి. నిన్న ఉదయం పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో జరిగిన NDA ఎంపీల సమావేశంలో మోదీని కూటమి పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్సింగ్ తీర్మానం ప్రవేశపెట్టగా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, గడ్కరీతోపాటు చంద్రబాబు, పవన్ సహా ఎన్డీయే పక్ష నేతలంతా బలపరిచారు. తీర్మానానికి NDA ఎంపీలంతా ఆమోదం తెలిపారు. ఎన్డీయే పార్లమెంటరీపార్టీ నేతగా, లోక్సభలో భాజపాపక్ష నేతగా ఎన్నికైన మోదీకి..నేతలు అభినందనలు తెలిపారు.
అనంతరం మాట్లాడిన మోదీ దేశ చరిత్రలో ఎన్డీయే అత్యంత విజయవంతమైన కూటమి అని పేర్కొన్నారు. చరిత్రలో అంకెల ప్రాతిపదిక ఇప్పటివరకు ఏర్పడిన కూటములను చూస్తే ఎన్డీయేనే శక్తిమంతమైందని మోదీ చెప్పారు. ఇకపై..కొత్త ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేయనున్నట్లు మోదీ తెలిపారు.వచ్చే పదేళ్లలో సుపరిపాలన, అభివృద్ధి, పౌరుల జీవితాల్లో తక్కువ జోక్యమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని, అన్ని మతాలు సమానమే అనే సూత్రానికి NDA కట్టుబడి ఉందని వివరించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించినా విపక్షాలు తమ విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయని..మోదీ విమర్శించారు. కానీ తమకు ఓటమి లేదని దేశ ప్రజలకు తెలుసునన్నారు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన స్థానాలు ఈ ఎన్నికల్లో బీజేపీ గెల్చిన సీట్ల కంటే తక్కువని తెలిపారు. మరో పదేళ్లయినా కాంగ్రెస్ 100 స్థానాల మార్క్ను దాటలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్సభతోపాటు జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ.... NDA ఘన విజయం
సాధించినట్లు గుర్తుచేసుకున్న మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిపై తమ ఆకాంక్షలను బలంగా చాటారని పేర్కొన్నారు. తర్వాత నేతలంతా కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లి NDA పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకున్న తీర్మానం ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ నెల 9 సాయంత్రం 6 గంటలకు... మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com