PM Modi: పోలెండ్ పర్యటనకు ప్రధాని మోడీ..

యూరోపియన్ దేశం పోలెండ్ పర్యటనకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. ఓ భారత ప్రధాని పోలెండ్ పర్యటనకు వెళుతుండడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాగా, మధ్య యూరప్ దేశాల్లో పోలెండ్ దేశం భారత్ కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుంది. పోలెండ్ కు చెందిన దాదాపు 30 కంపెనీలు భారత్ లో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అటు, పోలెండ్ లో భారత్ కు చెందిన 5 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు.
ఇక, పోలెండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ దేశం వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత విద్యార్థులకు పోలాండ్ సాయం చేసింది. ఉక్రెయిన్ నుంచి సుమారు 4 వేల మంది భారత విద్యార్థులు పోలాండ్ లోకి అడుగుపెట్టి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 6 వేల మంది పోలిష్ మహిళలు, చిన్నారులకు భారత భూభాగంలో ఆశ్రయం కల్పించారు. ఈ నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీతో మోడీ సమావేశం కానున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో.. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతుండటంతో నరేంద్ర మోడీ పర్యటనపై అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. అయితే, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటి నుంచో చెప్పుకొస్తుంది. ఇప్పుడు మోడీ కూడా జెలెన్ స్కీతో జరిగే సమావేశంలో అదే వైఖరికి కట్టుబడి ఉండే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com