PM Modi: ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారి క‌శ్మీర్ కు ప్రధాని మోదీ

PM Modi:  ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారి క‌శ్మీర్ కు ప్రధాని మోదీ
లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు భారీ ప్రాజెక్టులు ప్రారంభించ‌నున్న మోదీ

ప్రధాని నరేంద్రమోదీ అధికరణ 370రద్దు తర్వాత తొలిసారి ఇవాళ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించటంసహా వెయ్యి మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. ప్రధాని మోదీ కశ్మీర్‌ లోయ పర్యటన దృష్ట్యా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కశ్మీర్‌లోయలోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. బక్షీ స్టేడియంలో నిర్వహించే భారీ కార్యక్రమంలో పాల్గొంటారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే అధికరణ-370తర్వాత ప్రధాని మోదీ...మొదటిసారి కశ్మీర్‌కు వెళ్లనున్నారు. 15రోజుల వ్యవధిలో జమ్ము కశ్మీర్‌లో పర్యటించటం ఇది రెండోసారి. గతనెల 20న జమ్ములో పర్యటించిన ప్రధాని...పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేయటంతోపాటు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత జమ్ములో ఏర్పాటుచేసిన సభలో కూడా ప్రధాని పాల్గొన్నారు. ఇవాళ్టి కశ్మీర్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ...బక్షీ స్టేడియం నుంచి హజ్రత్‌బల్‌ దర్గా సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుతోపాటు సోనామార్గ్‌ స్కీ-డ్రాగ్‌ లిఫ్ట్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. హజ్రత్‌బల్‌ దర్గా ప్రాజెక్ట్‌ను తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్‌లో భాగంగా అభివృద్ధి చేశారు. గందర్‌బల్‌ జిల్లా సోనామార్గ్‌లో...స్కీ-డ్రాగ్‌ లిఫ్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈప్రాజెక్టు చేపట్టారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకోసం...చలో ఇండియా ప్రచారంలో భాగంగా...42నూతన పర్యాటక కేంద్రాలను ఆవిష్కరించటంసహా 9పర్యాటక ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా వెయ్యి మంది ఉద్యోగార్థులకు నియామకపత్రాలు కూడా అందజేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో జిల్లాల వారీగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించనున్నారు. శ్రీనగర్‌ పర్యటనలో భాగంగా...వ్యవసాయాభివృద్ధి కార్యక్రమంతోపాటు వ్యవసాయ పారిశ్రామికవేత్తల ప్రదర్శనను ప్రారంభిస్తారు.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో...శ్రీనగర్‌లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ప్రతి సందుతోపాటు మూలలోనూ బలగాలను మోహరించారు. డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నిఘా పెంపు చర్యల్లో భాగంగా

వేర్వేరు ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేయటంసహా వీవీఐపీల రాక నేపథ్యంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. బక్షీ స్టేడియానికి 2కిలోమీటర్ల పరిధిలోపూర్తి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story