PM Modi: వివేకానందుని ధ్యానమండపంలో.. నరేంద్రుని ధ్యానం

PM Modi:  వివేకానందుని ధ్యానమండపంలో.. నరేంద్రుని  ధ్యానం
X
45గంటలు , ద్రాక్ష రసం ,మంచినీరు స్వీకరిస్తూ మోదీ మెడిటేషన్​

కన్యాకుమారిలో ప్రధాని ధ్యానం కొనసాగుతోంది. ధ్యానంలో భాగంగా ఇవాళ ఉదయం ఆయన సూర్య అర్ఘ్యం సమర్పించారు. అనంతరం ధ్యానమండపం ప్రాంగణంలో జపం చేస్తూ అడుగులో అడుగేశారు. మోదీ ధ్యాన ప్రక్రియకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

131ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే ప్రధాని మోదీ...45 గంటల సుదీర్ఘ ధ్యాన ప్రక్రియ చేపట్టారు. గురువారం రాత్రి మొదలైన ఈ ధ్యానం...రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ప్రధాని మౌనంగా ఉంటారు. ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్న దృశ్యాలను భారతీయ జనతా పార్టీ ఎక్స్‌ ద్వారా ప్రజలతో పంచుకుంది. ధ్యాన ప్రక్రియలో భాగంగా ఇవాళ సూర్యోదయాన... భాస్కరుడికి నీటితో అర్ఘ్యం సమర్పించారు. అనంతరం ముఖుళిత హస్తాలతో సూర్యనమస్కారం చేశారు. వివేకానంద స్మారక ప్రాంగణంలో ప్రధాని మోదీ కలియతిరిగారు. చేతిలో జపమాల పట్టుకుని జపం చేసుకుంటూ అడుగులు వేశారు. ఆ ఫొటోలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ప్రధాని మోదీ ఆ తర్వాత మళ్లీ ధ్యాన మండపంలో కూర్చుని ధ్యానంలో నిమగ్నమయ్యారు. మెడిటేషన్‌ సమయంలో ప్రధాని మోదీ కేవలం ద్రవహారం మాత్రమే తీసుకుంటారు. గురువారం రాత్రి నుంచి ప్రారంభించిన ధ్యానం...జూన్‌ ఒకటో తేదీ సాయంత్రం ముగుస్తుంది. అప్పటివరకు కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మాత్రమే తీసుకుంటారు.సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్‌ నుంచి వెనుదిరిగిన ప్రధాని మోదీ...తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలాస్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక ధ్యానం చేపట్టారు.

ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆధ్యాత్మిక పర్యటనలకు శ్రీకారం చుట్టటం 2014 నుంచి మొదలైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండునెలలు ఊపిరిసలపని షెడ్యూల్‌తో అలసిపోయిన ఆయన...ధ్యానం చేయటం ద్వారా ఉపశమనం పొందుతుంటారు. 2014 ఎన్నికల అనంతరం తొలిసారి శివాజీకి చెందిన ప్రతాప్‌గఢ్‌ కోటలో గడిపారు. 2019 ఎన్నికల తర్వాత కేదార్‌నాథ్‌ ఆలయ గుహల్లో ధ్యానం చేశారు. ఇప్పుడు కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానం చేపట్టారు.

Tags

Next Story