సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి : ప్రధాని మోదీ

సైనికులతో ఉన్నప్పుడే తనకు నిజమైన దీపావళి అన్నారు ప్రధాని మోదీ. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకలను జరుపుకున్నారు. గతేడాది జమ్మూలో దీపావళి సెలబ్రేట్ చేసుకోగా.. ఈ సారి రాజస్థాన్ జైసల్మేర్కు సమీపంలోని లొంగ్వాలాలో బీఎస్ఎఫ్ జవాన్లతో గడిపారు. సైనికులకు స్వీట్లు పంచిన ప్రధాని.. పండగ శుభాకాంక్షలు చెబుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానితో పాటు సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రధాని ఘన నివాళులర్పించారు. స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కదులుతున్న యుద్ధ ట్యాంకుపై నిలబడి యుద్ధ క్షేత్రాన్ని పరిశీలించారు మోదీ.
ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతీ ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా.. 2018లో ఉత్తరాఖండ్ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకున్నారు. 2017లోనూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు ప్రధాని మోదీ. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకొచ్చానన్నారు. మీరుంటేనే దేశం ఉంటుందని.. మీరుంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. దేశ భద్రత కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షాలు తెలిపారు ప్రధాని. సరిహద్దులో ఇంచు కూడా వదులుకునే ప్రసక్తే లేదని.. అలా చేస్తే శత్రువులను వారి భూభాగం మీద నుంచే తిప్పికొడతామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com