PM Modi: ఉగ్ర దాడికి పాల్పడిన ఎవరినీ వదిలి పెట్టం: ప్రధాని

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. అలాగే, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. దాడి గురించిన వివరాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించాల్సిందిగా అమిత్ షాకు ప్రధాని మోడీ ఆదేశించారు. ఘటనపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇక, ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. బైసరన్ లోయలోకి వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ కూడా వదిలి పెట్టమని హెచ్చరించారు. నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందిస్తామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
కాగా, జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా తన ఇంట్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో వర్చువల్ గా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసులు, పారామిలిటరీ భద్రతా సంస్థ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీనియర్ అధికారులు హాజరయ్యారు. బైసరన్ లోయలో జరిగిన ఉగ్ర దాడి గురించి కీలక అంశాలపై చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com