PM Modi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఆలయంలో 50 నిమిషాలు గడిపిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ప్రధాని ఆలయంలో కొద్దిసేపు గడిపారు. ఆ తరువాత మోదీకి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అందజేశారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందే మోదీ శ్రీవారిని దర్శించుకొని అతిథిగృహం చేరుకున్నారు.

ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. శేషవస్త్రాన్ని అందజేశారు.


అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్ర పటం, డైరీ, క్యాలండర్ లను అందించారు. ప్రధాని మోదీ ఆలయంలోనే దాదాపు 50 నిమిషాలు గడిపారు. అనంతరం రచన గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హైదరాబాద్ కు పయనమవుతారు. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. ప్రధాని వెళ్లే మార్గాలలో దుకాణాలను మూయించారు. మీడియాను కూడా అనుమతించలేదు.

ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తిరుమలను దర్శించుకోవటం ఇది నాల్గోసారి. 2015, 2017, 2019 సంవత్సరాల్లో ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా తిరుమల వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. వీఐపీ అతిథి గృహాలను ఎన్ఎస్జీ టీమ్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలాఉంటే.. ప్రధాని తిరుమల దర్శనం పూర్తికావడంతో తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి తెలంగాణకు బయలుదేరారు. ఇవాళ మహబూబాబాద్, కరీంనగర్ లలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షోలో మోదీ పాల్గొంటారు.

Tags

Read MoreRead Less
Next Story