Siddhu Moosewala : సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పోలీసుల ముందడుగు..
Siddhu Moosewala : సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. మూసేవాలాపై కాల్పులు జరిపిన ఆరుగురు నిందితుల్లో పరారీలో ఉన్న ఆఖరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఇద్దరిని పంజాబ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇక పరారీలో ఉన్న దీపక్ ముండీ, అతని ఇద్దరు సహచరులు కపిల్ పండిట్, రాజిందర్ను పశ్చిమ బెంగాల్- నేపాల్ సరిహద్దులో పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
ఢిల్లీ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో పంజాబ్ పోలీసులు.. దీపక్, అతని సహచరులు కపిల్ పండిట్, రాజిందర్లను అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని పశ్చిమ బెంగాల్ - నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారు. మూసేవాలాపై కాల్పులకు పాల్పడిన నిందితుల్లో దీపక్ ఒకడు. కపిల్ పండిట్, రాజిందర్లు ఆయుధాలు, ఆశ్రయంతోపాటు ట్రాన్స్పోర్ట్ సాయం అందించారు.
ముఠా కక్షల కారణంగానే ముసేవాలాను హత్య చేసినట్లు అనుమానించిన పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేపట్టారు. హత్య వెనుక ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయేనని వెల్లడించారు. మూసేవాలాను హత్య చేసినట్లు ఆరుగురిపై ఆరోపణలు రాగా.. ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఇద్దరు పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందగా.. పరారీలో ఉన్న ఆఖరి వ్యక్తి దీపక్ తాజాగా పట్టుబడ్డాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com