Uttar Pradesh: పురిటినొప్పులు భరించలేక.. కడుపు కోసుకున్న గర్భిణి

Uttar Pradesh: పురిటినొప్పులు భరించలేక..  కడుపు కోసుకున్న గర్భిణి
X
ఆరు నెలల క్రితం భర్త మరణించడంతో ఒంటరిగా ఉంటున్న మహిళ

‘అమ్మా’ అనే పిలుపు కోసం ఓ మహిళ పడే తపన ఎంత గొప్పదో.. ఆ పిలుపును అందుకోవడానికి ఆమె అనుభవించే ప్రసవ వేదన అంత భయంకరమైనది. కానీ, ఆ వేదన కట్టలు తెంచుకుంటే అది ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కళ్లకు కడుతోంది. ఆసుపత్రికి తీసుకు వెళ్లే వారు లేక.. పురిటి నొప్పుల తీవ్రతను తట్టుకోలేక ఓ గర్భిణీ తన కడుపును కత్తితో కోసుకున్న ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఒంటరితనం.. ఆపై తీరని వేదన

నంద్వాల్ గ్రామానికి చెందిన నంకై (35) జీవితం గత ఆరు నెలలుగా కష్టాలతోనే సాగుతోంది. అనారోగ్యంతో భర్త చనిపోవడంతో గర్భిణీ అయిన ఆమె ఒంటరిగానే కాలం వెళ్లదీస్తోంది. నెలలు నిండడంతో గురువారం మధ్యాహ్నం ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ వినిపించలేదు. నొప్పులు క్షణక్షణానికి రెట్టింపవుతుంటే, ఆ బాధను భరించలేక విచక్షణ కోల్పోయిన ఆమె.. వంటింట్లోని కూరగాయలు కోసే కత్తితో తన పొత్తికడుపును కోసుకుంది.

మృత్యువుతో పోరాడుతూ బిడ్డకు జన్మ

ఆమె ఆర్తనాదాలు విన్న గ్రామస్థులు పరుగెత్తుకుంటూ వచ్చి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న నంకైని చూసి హతాశులయ్యారు. కడుపు కోసుకోవడంతో పేగులు బయటకు వచ్చిన స్థితిలో ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ, వైద్యుల సమక్షంలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ క్షేమంగానే ఉన్నప్పటికీ, తీవ్ర రక్తస్రావం కారణంగా నంకై పరిస్థితి విషమంగా మారింది.

వైద్యుల దిగ్భ్రాంతి..

జిల్లా ఆసుపత్రికి తరలించినప్పుడు ఆమె గాయాలను చూసి వైద్యులు విస్తుపోయారు. "ఆమెను తీసుకువచ్చినప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. గాయం చాలా లోతుగా ఉండటంతో పాటు తీవ్ర రక్తస్రావం జరిగింది" అని మెడికల్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను లక్నో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోంది.

Tags

Next Story