Droupadi Murmu: కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. అంతకముందు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి యూపీకి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో ప్రయాగ్రాజ్కు చేరుకుని రాష్ట్రపతి పుణ్య స్నానం ఆచరించారు.
రాష్ట్రపతి ప్రయాగ్రాజ్లో ఎనిమిది గంటలకు పైగా ఉండనున్నారు. బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శిస్తారు. అదేవిధంగా కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్ను పరిశీలిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు ప్రయాగ్రాజ్ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరుతారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల దౌత్యవేత్తలు వచ్చి పుణ్యస్నానాలు చేసి వెళ్లారు. ఇక భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com