5G Services In India : 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోది..
5G Services In India : ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భారత్ 5G ఇండియాగా ఆవిష్కృతం అయింది. దేశంలో 5G సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి భవన్ లో నిర్వహిస్తున్న ఇండియా మోబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఈ కార్యక్రమంలోనే 5G సేవలను కూడా లాంఛనంగా ఆవిష్కరించారు.
దీంతో తొలి దశలో దేశంలోని 13 నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, ఛండీఘర్, చెన్నై, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పూణెలో 5G సేవలు అందుబాటులో ఉంటాయి. దశలవారీగా 5G సేవలను విస్తరిస్తారు. రెండేళ్లలో దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో 5G అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
ఇవాళ చారిత్రక రోజని, 5Gతో భారత్ కొత్త శకానికి నాంది పలికిందన్నారు ప్రధాని మోదీ. డిజిటల్ ఇండియాకు 5G నిదర్శనమన్నారు. 5G కొత్త అవకాశాలు తీసుకువస్తుందని చెప్పారు. డిజిటల్ ఇండియా ఓ పేరు కాదని భారత్ విజన్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలతో పాటు కొత్త అవకాశాలు, ప్రయోజనాలు 5G ద్వారా లభించనున్నాయి. 4Gతో పోలిస్తే పదిరేట్లకు పైగా వేగంతో డేటా సేవలు 5G ద్వారా లభిస్తాయి. నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు..డిజిటల్ ఇండియా విజన్ను చేరుకోవడానికి దోహద పడతాయి. 5Gతో కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు కలుగుతాయి.
ఫుల్ లెంగ్త్ హై క్వాలిటీ వీడియోను కూడా క్షణాల్లో డౌన్లోడ్ చేసుకునే వీలవుతుంది. 2035 నాటికి భారత్ను 450 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5G ముఖ్యపాత్ర పోషిస్తుందని కేంద్రం తెలిపింది. చైనా తర్వాత స్మార్ట్ ఫోన్లకు పెద్ద మార్కెట్గా ఉన్న భారత్లో 5G రాక విప్లవాత్మక మార్పులకు నాంది పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన 5G వేలం పక్రియలో లక్షా 50 వేల కోట్ల విలువైన స్పెక్టమ్లను విక్రయించారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో 88వేల 78 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను దక్కించుకుంది. సునీల్ మిత్తల్ నేతృత్వంలోని ఎయిర్టెల్ 43వేల 84 కోట్లు, వొడాఫోన్ ఐడియా 18వేల 799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను కొనుగోలు చేశాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com