Samudrayaan: చంద్ర, సూర్యుల తరువాత సముద్రమే..

చంద్రుడు, సూర్యుడి తర్వాత ఇప్పుడు సముద్ర గర్భాన్ని శోధించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. దీని కోసం రూ.4,077 కోట్ల వ్యయంతో సముద్రయాన్ పేరిట మానవ సహిత సముద్ర యాత్ర చేసేందుకు సమాయత్తం అయ్యింది. సముద్రయాన్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్ఐవోటీ)కి చెందిన శాస్త్రవేత్తలు ‘మత్స్య 6000’ పేరిట ఓ సబ్మెర్సిబుల్ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నారు. డిజైన్, టెస్టింగ్, మెటిరీయల్స్, సర్టిఫికేషన్స్, రిడండెన్సీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సహా అన్ని బాధ్యతలను తీసుకున్న ఎన్ఐవోటీ శాస్త్రవేత్తల రెండేండ్ల కృషి ఫలితంగా ‘మత్స్య 6000’ రూపుదిద్దుకుంది.
సముద్రయాన్ మిషన్లో కీలకమైన జలాంతర్భాగ వాహనం మత్స్య6000 ఫొటోలను కేంద్ర మంత్రి రిజిజు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (ట్విట్టర్)లో విడుదల చేశారు. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ ఈ వాహనాన్ని తయారు చేసింది. గోళాకారంలో ఉండే మత్స్య6000, ముగ్గురు ఆక్వానాట్లను సముద్రం అడుగున 6వేల మీటర్ల లోతు వరకూ తీసుకెళ్లగలదని రిజిజు వివరించారు. దీనిద్వారా లోతైన సముద్ర వనరులు, జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చని, ఈ ప్రాజెక్ట్ సముద్ర పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగించదని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఇప్పటివరకు సముద్ర శోధనలు చేసేందుకు మానవ సహిత సబ్మెర్సిబుల్ను అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ మాత్రమే రూపొందించాయి. భారత్ రూపొందించిన మత్స్య 6000 ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నది. ఈ ఏడాది జూన్లో టైటాన్ సబ్మెర్సిబుల్ సముద్రంలో పేలిపోవడంతో దీనికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2024 ప్రథమార్ధంలో ముగ్గురు శాస్త్రవేత్తలతో ఈ సబ్మెర్సిబుల్ చెన్నై తీరంలోని సముద్ర గర్భంలో 500 మీటర్ల లోతుల్లో దిగనున్నది. అన్ని పరీక్షలు పూర్తయితే 2026లో ఈ సబ్మెర్సిబుల్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నది.
సముద్ర గర్భంలో ఉన్న ఖనిజాల అన్వేషణ, జీవవైవిధ్యంపై పరిశోధనలు చేయడమే సముద్రయాన్ మిషన్ లక్ష్యం. అత్యంత విలువైన లోహాలు, ఖనిజాలను ఈ మిషన్లో భాగంగా అన్వేషించనున్నారు. కోబాల్ట్, నికెల్, మాంగనీస్, హైడ్రో థర్మల్ సల్ఫైడ్స్, గ్యాస్ హైడ్రేట్స్, కిమోసింథటిక్ బయోడైవర్సిటీ, లో టెంపరేచర్ మీథేన్ సీప్స్పై శాస్త్రవేత్తలు దృష్టి సారించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com