Agneepath Protest: 'అగ్నిపథ్'పై ఆగ్రహజ్వాలలు.. బిహార్‌లో నిరసనలు..

Agneepath Protest: అగ్నిపథ్పై ఆగ్రహజ్వాలలు.. బిహార్‌లో నిరసనలు..
Agneepath Protest:భారత రక్షణశాఖలో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రకటించిన 'అగ్నిపథ్‌' పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు

Agneepath Protest: భారత రక్షణశాఖలోని త్రివిద దళాల్లో స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ కోసం.. కేంద్రం ప్రకటించిన 'అగ్నిపథ్‌' పథకాన్ని వ్యతిరేకిస్తూ.. పలు చోట్ల హింసాత్మక ఘటలు అట్టుడికాయి. బీహార్‌లో రెండో రోజు ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. భభువా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు అద్దాలను పగులగొట్టి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఏకంగా కోచ్‌కు నిప్పంటించారు. పట్నా-గయా, పట్నా-బక్సర్ హైవేలను నిరసనకారులు నిర్బంధించారు.

ముజఫర్‌పూర్‌, బక్సార్‌, బెగూసరాయ్‌లో యువకులు నిరసన వ్యక్తంచేశారు. అటు యూపీ, హర్యానాలో ఆందోళనలు మిన్నంటాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తమ పరిస్థితి ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. అటు అగ్నిపథ్ స్కీమ్‌పై కేంద్రం పునరాలోచన చేయాలని రాజకీయపక్షాలు డిమాండ్ చేశాయి. నిరుద్యోగులను అగ్నిపథ్​లో నడిపించి వారికి సహనానికి అగ్నిపరీక్షపెట్టొద్దని రాహుల్‌ ట్వీట్ చేశారు.

అగ్నిపథ్ ​స్కీమ్‌తో గడువు ముగిసిన 75 శాతం మంది భవిష్యత్‌ ఏంటన్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం చచెప్పాలని ప్రశ్నించారు చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు. అగ్నిపథ్‌ పథకంతో గ్రామీణ యువత నష్టపోతారని యూపీ మాజీ సీఎం మాయావతి విమర్శించింది. అటు దేశ ప్రయోజనాలకు హాని కలిగించేలా ఈ పథకం ఉందని వామపక్షాలు ఆరోపించాయి. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం ఈ పథకంపై వ్యతిరేకతను తెలియజేస్తూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు.

అగ్నిపథ్​ స్కీమ్‌పై నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఈ స్కీమ్‌ సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తొలి ఏడాది ఈ పథకం ద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య మొత్తం సైన్యంలో 3 శాతమేనని పేర్కొంది. సైన్యంలో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అగ్నిపథ్​ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్రం వెల్లడించింది. సైన్యంలోని రెజిమెంటల్​ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయమని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story