Rahul Gandhi: రాహుల్ గాంధీపై రెండోరోజు ముగిసిన ఈడీ విచారణ.. 10 గంటల పాటు..

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ విచారణ ముగిసింది. వరుసగా రెండోరోజు దాదాపు పది గంటల పాటు రాహుల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. తిరిగి రేపు కూడా విచారణకు రావాలని మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో మూడోరోజు కూడా రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.
ఉదయం 11 గంటలకు తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఈడీ కార్యాలయానికి రాహుల్ చేరుకున్నారు. ఉదయం నాలుగు గంటల పాటు విచారించిన అధికారులు.. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో రాహుల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి మధ్యాహ్నం బయటకు వచ్చారు. భోజన విరామం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు తిరిగి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రాహుల్.
ప్రధానంగా ఏజేఎల్లో సోనియా, రాహుల్ వాటా ఎంత ఉంది? సంస్థలో ఇంకా ఎవరెవరికి షేర్లు ఉన్నాయి? ఏజేఎల్ సంస్థకు కాంగ్రెస్ ఇచ్చిన నిధులెంత? అప్పులు, ఆస్తుల వివరాలేంటి? తదితర అంశాలపై రాహుల్కు ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అంతకుముందు సోమవారం దాదాపు పది గంటల పాటు విచారించి రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేసారు ఈడీ అధికారులు. మరోవైపు ఇదే కేసులో జూన్ 23న సోనియాగాంధీ ఈడీ ముందు విచారణకు హాజరుకానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com