RAHUL: ఈడీపై మరోసారి రాహుల్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు ఈ సమాచారం తెలియజేశారని వెల్లడించారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్రవ్యూహం’ ప్రసంగం నచ్చలేదని రాహుల్ అన్నారు. తనపై సోదాలకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తెలిపారని... వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్సభలో జరుగుతున్న చర్చలో భాగంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై రాహుల్గాంధీ విమర్శలు సంధించారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో... ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారని అన్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు.
రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశాన్ని బంధించిన చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయన్నారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com