Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్

లోక్సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘంభారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్కు సర్వంసిద్ధమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్సహా 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. కేరళలో మొత్తం 20స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13,మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్లో 8చొప్పున, మధ్యప్రదేశ్లో 6, అసోం, బిహార్లో ఐదు చొప్పున, ఛత్తీస్గఢ్, పశ్చిమ బంగాల్లో మూడుచొప్పున, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్లో ఒక్కోస్థానానికి ఓటింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20స్థానాలకు...ఈ విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 194మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని UDF, సీపీఎం సారథ్యంలోని LDF, భాజపా సారథ్యంలోని NDAమధ్య త్రిముఖపోరు నెలకొంది. కేరళలో 2.77కోట్ల మంది ఓటర్లు ఉండగా...వారిలో 5 లక్షల మంది తొలిసారి ఓటుహక్కు పొందినవారు ఉన్నారు. వారి కోసం 25,231 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన ఈసీ...ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా 66వేలకుపైగా భద్రతాదళాలను మోహరించింది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని UDF 19 స్థానాలు గెలుపొందగా...సీపీఎం నేతృత్వంలోని LDF ఒక్క స్థానానికే పరిమితమైంది.
కర్ణాటకలో మొత్తం 28లోక్సభ సీట్లు ఉండగా...14స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 247 మంది పోటీ చేస్తున్నారు. ఈ విడతలో 2.88కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 30వేల 602 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ 14చోట్ల పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ 11, ఎన్డీయే భాగస్వామి జేడీఎస్ 3 స్థానాల్లో బరిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 14స్థానాలకుగాను భాజపా 11 చోట్ల , ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి ఒక చోటు నెగ్గారు. అప్పుట్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ చెరో లోక్సభ స్థానంలో విజయం సాధించాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన హస్తం పార్టీ...ఈసారి గట్టిపోటీ ఇస్తోంది.
రాజస్థాన్లో మొత్తం 25స్థానాలు ఉండగా...తొలి దశలో 12 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 13నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 152మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా..వారిలో ఇద్దరు కేంద్రమంత్రులు, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, అసెంబ్లీ మాజీ స్పీకర్ తదితరులు ఉన్నారు. రెండోవిడత పోలింగ్తో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు పూర్తవుతాయి. శుక్రవారం పోలింగ్ జరగనున్న 88స్థానాలకు సంబంధించి 2019లో ఎన్డీయే 56 సీట్లు గెలుపొందగా...ఇప్పుడు ఇండియా కూటమిగా పిలుస్తున్న అప్పటి యూపీఏ 24 చోట్ల విజయం సాధించింది. ఈ నెల 19న 102 స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో 65 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com