Rahul Gandhi: ప్రధానివి పచ్చి అబద్ధాలు

Rahul Gandhi: ప్రధానివి పచ్చి అబద్ధాలు
చైనా మన భూమిని ఆక్రమించినా మోదీ నిజం చెప్పడం లేదన్న రాహుల్‌... కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద నివాళులు..

వేలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినా ప్రధానమంత్రి (Prime Minister Narendra Modi )నిజం చెప్పడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi ) మరోసారి విమర్శలు గుప్పించారు. బ్రిక్స్ (BRICS) సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్( Chinese President Xi Jinping) సంభాషించుకున్న వేళ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్( Ladakh) పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కార్గిల్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత రాహుల్ లద్ధాఖ్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.


లద్ధాక్‌ వ్యూహాత్మక ప్రదేశమని రాహుల్‌ స్పష్టం చేశారు. చైనా ఒక అంగుళం భూమినైనా ఆక్రమించుకోలేదని ప్రతిపక్షాల సమావేశంలో ప్రధాన మంత్రి చెప్పడం విచారకరమని ఇది శుద్ధ అబద్ధమని( absolutely false) ఆయన ఆరోపించారు. దేశంలో బీజేపీ, ఆరెస్సెస్ వ్యాపింపజేస్తున్న హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా నిలవడమే లక్ష్యంగా తన భారత్‌ జోడో యాత్ర కొనసాగిందని రాహుల్‌ తెలిపారు.

రాహుల్ గాంధీ ఈ నెల 17 నుంచి నుంచి లద్ధాఖ్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం రాహుల్ శ్రీనగర్ వస్తున్నారని జమ్ముకశ్మీరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వని చెప్పారు. ఈ పర్యటనలో సోనియా గాంధీ కూడా పాల్గొంటున్నారని, వీరిద్దరూ రాజకీయ నేతలను కలవబోరని వెల్లడించారు.


మొదటి విడత భారత్ జోడో యాత్రకు అశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజు రెండో విడత యాత్ర చేపట్టనున్నారు. గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి మేఘాలయా వరకు రెండో విడత భారత్‌ జోడో యాత్ర కొనసాగనుంది. మహాత్మ గాంధీ పుట్టిన గడ్డ నుంచే గాంధీ జయంతి రోజునే ఈ యాత్ర ప్రారంభం కానుంది.

2024 జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత యాత్ర ముగియనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొననున్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story