Ashwini Vaishnaw: గంటకు 320కి.మీ స్పీడ్- రూ.లక్ష కోట్ల బడ్డెట్
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటారు . తాజాగా, ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ విశేషాలతో కూడిన వీడియోను ట్విట్టర్ వేదికగా ఆయన షేర్ చేశారు. గంటకు గరిష్ఠంగా 320 కి.మీల వేగంతో కేవలం రెండు గంటల్లో 508 కిమీ ప్రయాణం.. నదులపై 24 వంతెనలతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ ప్రభుత్వం కలలు కాదు.. వాస్తవాలను సృష్టిస్తోందంటూ.. ప్రధాని మోదీ మూడో పాలనలో ‘బుల్లెట్ రైలు’ కోసం ఎదురుచూడండంటూ రాసుకొచ్చారు.
'ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్'కు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఉన్న ఓ వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేగాక ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు అశ్వినీ వైష్ణవ్. దీన్ని భారత భవిష్యత్తుగా వీడియోలో పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా స్లాబ్ ట్రాక్ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే గుర్తించే ఏర్పాట్లు, 28 స్టీలు వంతెనలు, ఏడు సొరంగాలు, సముద్రగర్భంలో 7 కి.మీ పొడవైన టన్నెల్, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వేస్టేషన్లు తదితర విశేషాలను ఆయన ప్రస్తావించారు. కాగా, దాదాపు రూ.1.08 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా 2026లో పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అహ్మదాబాద్-ముంబయి మధ్య అందుబాటులోకి రానున్న తొలి బుల్లెట్ రైలులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి సిద్ధం కానుందని ఇదివరకే రైల్వే మంత్రి ప్రకటించారు. గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 50కి.మీ దూరం పూర్తవుతుందన్నారు. 508.17 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రైలు కారిడార్లో ఇప్పటికే 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని మంత్రి వెల్లడించారు. ఇక ఈ బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోపే అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. వందేభారత్ స్లీపర్ రైళ్లను 2024లో మార్చిలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్రం గతేడాది సెప్టెంబరులో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com