Rajasthan assembly elections: రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్
![Rajasthan assembly elections: రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్ Rajasthan assembly elections: రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్](https://www.tv5news.in/h-upload/2023/11/25/1123000-rajasthan-elections-2023-vo.webp)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. రాజస్థాన్లో ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,863 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకూ కొనసాగుతుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనర్ మరణంతో కరణ్పూర్ స్థానంలో ఎన్నికలు వాయిదా వేశారు.
199 స్థానాలకు గాను 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5.25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1.71 కోట్ల మంది 18 నుంచి 30 ఏండ్ల వయస్సులోపు వారే కావడం విశేషం. ఈ సారి కొత్తగా 22.61 లక్షల మంది మొదటిసారి ఓటు వేస్తున్నారు. దీంతో పార్టీల భవితవ్యాని యువ ఓటర్లే నిర్ణయించనున్నారు.
కాగా, 59 మంది సిట్టింగ్లకు ప్రతిపక్ష బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో నిలిపింది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నా.. సీపీఎం, ఆర్ఎల్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆప్, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. కాంగ్రెస్, బీజేపీలకు 40 స్థానాల్లో రెబెల్స్ నుంచి పోటీ ఎదురవుతున్నది.
కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకునేందుకు శ్రమిస్తుండగా బీజేపీ అధికార పక్షాన్ని గట్టిదెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సర్దార్పుర నుంచి బరిలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ నుంచి పోటీలో నిలిచారు. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ టాంక్ సీటు నుంచి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాజేంద్ర రాథోడ్ తారానగర్ సీటు నుంచి బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 51,507 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్త తెలిపారు. 26,393 పోలింగ్ బూత్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com