Serial Killer: డ్రైవర్లను చంపేసి.. మొసళ్లకు ఆహారంగా వేసిన సీరియల్‌ కిల్లర్‌ అరెస్టు

Serial Killer: డ్రైవర్లను  చంపేసి.. మొసళ్లకు ఆహారంగా వేసిన సీరియల్‌ కిల్లర్‌ అరెస్టు
X
సినిమా స్టోరీని మించే హత్యలు !

భారత దేశంలో అత్యంత భయానకమైన సీరియల్ కిల్లర్లలో ఒకడైన 67 ఏళ్ల దేవేందర్ శర్మ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబట్టాడు. ముఖ్యంగా పెరోల్‌పై విడుదల అయిన ఇతడు కనిపించకుండా పోగా.. అతడిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇతడు రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఒక ఆశ్రమంలో పూజారి వేషంలో తలదాచుకుంటున్నట్లు గుర్తించి మరీ అరెస్ట్ చేసింది. అయితే ఇతడు గతంలో కేవలం ట్యాక్సీ, ట్రక్కు డ్రైవర్లనే లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడ్డాడని.. ఆపై వారి మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా వేశాడని పోలీసులు గతంలోనే గుర్తించారు. కేవలం ఏడు హత్య కేసుల్లోనే ఈ నరరూప రాక్షసుడికి జీవిత ఖైదు శిక్ష పడగా.. 50కి పైగా హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అసలెవరీ దేవేందర్ శర్మ..?

దేవేందర్ శర్మ ఒక ఆయుర్వేద వైద్యుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. 1994లో గ్యాస్ డీలర్‌షిప్‌లో భారీ నష్టాలు రావడంతో.. నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. 1995 నుంచి 2004 వరకు ఆయన అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్‌ను కూడా నడిపారు. ఇందులో భాగంగానే 125కు పైగా అక్రమ మార్పిడులు జరిగాయని పోలీసులు తెలిపారు. దీని తర్వాత హత్యల చేయడానికి కూడా అలవాటు పడ్డాడు.

హత్యలు చేసి మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా వేయడం

2002 నుంచి 2004 మధ్య కాలంలో దేవేందర్ శర్మ తన సహచరులతో కలిసి టాక్సీ, ట్రక్ డ్రైవర్లను మోసం చేసి హత్యలు చేయడం ప్రారంభించాడు. వాహనాలను గ్రే మార్కెట్‌లో విక్రయించి.. ఆపై మృతదేహాలను ఉత్తర ప్రదేశ్‌లోని మొసళ్లు ఎక్కువగా ఉండే కాస్గంజ్‌లోని హజారా కాల్వలో పడేసేవాడు. ఇలా చేయడంతో ఆధారాలు నాశనం అయ్యాయి. అయితే ఇతడు దాదాపుగా 50కి పైగా మందిని చంపేశాడు. కానీ వెలుగులోకి వచ్చింది, పోలీసులు ఆధారాలతో పట్టుకుంది మాత్రం ఏడు కేసుల్లోనే.

ఎప్పుడు, ఏం శిక్ష పడింది..?

దేవేందర్ శర్మపై ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు హత్యల కేసుల్లో జీవిత ఖైదు విధించబడింది. గుర్గావ్ కోర్టు ఒక కేసులో మరణ శిక్షను కూడా విధించింది. 2023 ఆగస్టులో తిహార్ జైలు నుంచి పెరోల్‌పై విడుదలైన ఈ నరరూప రాక్షసుడు తిరిగి జైలుకు వెళ్లలేదు. తన గుర్తింపును మార్చుకుని మరీ రాజస్థాన్ లోని దౌసా జిల్లాలోని ఓ ఆశ్రమంలో జీవిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈయనపై మొత్తం 57 హత్య, అపహరణ, దోపిడీ కేసులు కూడా ఉన్నాయి.

పోలీసులకు ఎలా చిక్కాడంటే..?

పోలీసులు ఆరు నెలల పాటు ఆలీఘడ్, జైపూర్, ఢిల్లీ, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాల్లో సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మ కోసం గాలింపు చేపట్టారు. రెండేళ్ల పాటు వెతికి మరీ చివరకు రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఒక ఆశ్రమంలో పూజారి వేషంలో ఉన్న శర్మను అరెస్ట్ చేశారు.

Tags

Next Story