Ayodhya: లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమూనా
అయోధ్య రామమందిరం ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ ఉత్సవానికి ముందే కొందరు శిల్పకారులు... మధ్యప్రదేశ్లో అయోధ్య రామమందిర నమూనాను తయారు చేశారు. లోహపు వ్యర్థాలతో అచ్చం రామమందిరం లాగానే మలిచి అందరినీ అబ్బురపరుస్తున్నారు.
దేశవ్యాప్తంగా రామభక్తులు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే... కొందరు శిల్పకారులు మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిర నమూనాను నిర్మించారు. దీనికోసం వివిధ రాష్ట్రాలు, భిన్న మతాలకు చెందిన ఇరవై మంది శిల్పకారులు దాదాపు మూడు నెలలు శ్రమించి రామమందిర నమూనాను మలిచారు. ఈ నమూనాను మొత్తం పాతబడిన వాహనాలు, విద్యుత్ ఇనుప స్తంబాలు, లోహపు వ్యర్థాలు, ఇనుప పైపులను పేర్చి వెల్డింగ్ చేసి తయారు చేసినట్లు శిల్పకారులు పేర్కొన్నారు.
ఈ రామమందిరాన్ని ఇరవై ఏడు అడుగుల ఎత్తుతో, నలభై అడుగల వెడల్పుతో తయారు చేశారు. దీనిని పూర్తి చేయడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టిందని శిల్పకారులు తెలిపారు. ఇప్పటివరకూ తాజ్మహాల్, ఈఫిల్ టవర్ లాంటి నమూనాలను నిర్మించారు కానీ, రామమందిరాన్ని ఎవరూ తయారు చేయలేదని వెల్లడించారు. అందుకే స్థానికుల ప్రోత్సహంతో తాము ఈ అయోధ్య రామమందిర నమూనాను నిర్మించామని తెలిపారు. ఇంకా నమూనాకు రంగులతో తుది మెరుగులు దిద్దాల్సి ఉందని వివరించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాకముందే నమూనా పూర్తి చేసినందుకు శిల్పకారులు సంతోషం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com