Karnataka: కర్ణాటకలో రాపిడో యాప్లో 'బైక్' స్థానంలో 'బైక్ పార్శిల్' ఆప్షన్

భారతదేశంలో 'జుగాడ్' అనే హిందీ పదానికి 'అసాధారణమైన, వినూత్నమైన పరిష్కారం' అని అర్థం. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు బెంగుళూరులో కనిపిస్తోంది. బైక్ టాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడంతో యాప్ ఆధారిత రైడ్ అగ్రిగేటర్ సంస్థ రాపిడో ప్రయాణికులను 'బైక్ పార్శిల్' సేవల ద్వారా గమ్యస్థానాలకు చేరవేస్తోందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ట్రాఫిక్ జామ్లు, అధ్వానపు రోడ్లతో సతమతమవుతున్న ప్రయాణికులు ఈ కొత్త పద్ధతిని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
కర్ణాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు చెప్పింది. గత శుక్రవారం (13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. మోటారు వాహనాల చట్టం కింద 'బైక్ టాక్సీల' కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట నియమాలు, మార్గదర్శకాలను తెలియజేసే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే, ఈ నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపవచ్చని కోర్టు సూచించినప్పటికీ, అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రయాణికుల ఆశలు అడియాసలయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.
రాపిడో 'జుగాడ్'
ఈ పరిణామాల నేపథ్యంలో రాపిడో తమ యాప్లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. "కర్ణాటకలో బైక్ టాక్సీ నిషేధం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. కానీ రాపిడో బైక్ యాప్ ప్రొడక్ట్ ఓనర్ ఇప్పటికే చట్టాన్ని ఉల్లంఘించారు. రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ధన్వి అనే ఒక ఎక్స్ యూజర్ 'బైక్ పార్శిల్' బుకింగ్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు.
అముత భారతి అనే మరో ఎక్స్ యూజర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "కర్ణాటక హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలను నేటి నుంచి నిషేధించింది. ఉబర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా, రాపిడో 'బైక్'ను 'బైక్ పార్శిల్'గా మార్చింది. తెలివైన ఎత్తుగడ" అని ఆమె పేర్కొన్నారు.
కోర్టు నిర్ణయంపై విమర్శలు
బెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. కోర్టు, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com