Puri: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం..

పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. దాదాపు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తలుపులను తెరిచారు. మధ్యాహ్నం 1.28 గంటలకు రత్న భాండాగారం తలుపులు తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత కొంత సమయానికి తలుపులు తెరుచుకున్నాయి. ఈ విషయాన్ని ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
మొత్తం 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. వీరిలో రత్న భాండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్, ఆ కమిటీ సభ్యుడు సీబీకే మహంతి, ఆలయ పాలనాధికారి అరవింద పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తుశాఖ ఇంజినీర్ ఎన్సీ పాల్, పూరీ రాజప్రతినిధితో పాటు ఐదుగురు ఆలయ సేవాయత్లు ఉన్నారు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరీ రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
రత్న భాండాగారం తెరవనున్న నేపథ్యంలో శ్రీక్షేత్రంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండిచా మందిరానికి వెళ్లి జగన్నాథుడి అనుమతి తీసుకున్నారు. అనంతరం లోకనాథ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అక్కడ ఆజ్ఞమాల (పూలమాల) తీసుకుని శ్రీచక్రం (ఖజానా గది) వద్దకు చేరుకున్నారు. అంతకుముందు శ్రీచక్రానికి రక్షగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఆ తల్లుల అనుమతితో రత్న భాండాగారం తెరిచారు. గదిలో సర్పాలు ఉన్నాయనే అనుమానంతో ముందు జాగ్రత్తగా స్నేక్ హెల్ప్లైన్, 40 మందితో కూడిన ఓడీఆర్ఏఎఫ్ బృందాలను ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచారు. అవసరమైతే వీరిని లోపలికి తీసుకెళ్లనున్నారు.
రత్న భాండాగారాన్ని చివరిసారిగా 46 ఏళ్ల క్రితం 1978లో తెరిచారు. సంపద ఉన్న పెట్టెలు జీర్ణావస్థలో ఉంటే మార్చేందుకు వీలుగా 15 చెక్క పెట్టెలను అధికారులు సిద్ధం చేయించారు. వాటిలో ఆరింటిని ఆ గది వద్దకు ఆదివారం ఉదయం తరలించారు. శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు.
ఈసారి లెక్కింపు తర్వాతే జగన్నాథుని ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. రత్న భాండాగారంలోని సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కించే వీలుంది. ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియనంతా ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయనుంది. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది?అనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా? అనే వివరాలపై స్పష్టత రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com