Cyber Crime: వలపు వల విసిరి రిటైర్డ్ ఇంజనీర్ నుంచి రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా సైబర్ నేరాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా థానేలో సెక్స్టార్షన్ కేసు వెలుగు చూసింది. ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఇంజనీర్పై మహిళ వలపు వల విసిరింది. అందులో చిక్కుకున్న వృద్ధుడు రూ.4 కోట్లు వదిలించుకున్నాడు. దీంతో బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ, ఆమె అనుచరులు రిటైర్డ్ ఇంజనీర్ (62)ను ఉచ్చులోకి లాగారు. ఒక మహిళ భావోద్వేగంతో రెచ్చగొట్టింది. దీంతో అతడు ఆమె వలలో చిక్కుకున్నాడు. అనంతరం నెమ్మది నెమ్మదిగా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
జూలై 17, 2025న బాధితుడికి తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తడంతో ఒక మహిళ మాట్లాడుతూ వ్యాపారం గురించి చర్చించింది. అంతర్జాతీయ వ్యాపారాలతో కోట్లు గడించవచ్చని నమ్మించింది. అటు తర్వాత నెమ్మది.. నెమ్మదిగా వలపు వల విసిరింది. ప్రేమ కురిపిస్తూ నటించింది. నిజమే అనుకుని వృద్ధుడు నమ్మేశాడు. అనంతరం అమెరికాలో తన మామ ద్వారా మంచి లాభదాయక వ్యాపారం ఉందని నమ్మ బలికింది. అటు తర్వాత ట్రేడింగ్ ఖాతా లింక్ పంపించింది. 7 నెలల్లో వివిధ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగాయి. అయితే గత నెలలో విత్డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా మోసం బయటపడింది. ఆ మహిళ నుంచి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు రావడం ప్రారంభమయ్యాయి. నగ్న ఫొటోలను పంపించాలని ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో జనవరి 25న ఒక వ్యక్తి ఫోన్ చేసి మహిళ మామగా పరిచయం చేసుకున్నాడు. రూ.2 కోట్ల ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక మొత్తానికి ఏడు నెలల్లో దాదాపు రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
