Salman Khan: సల్లూ భాయ్కు మరోసారి బెదిరింపులు.. రూ.5కోట్లు డిమాండ్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్కు ఈ మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఈ మెసేజ్ వచ్చింది. ‘‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ (ఇటీవల హత్యకు గురైన) కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని దుండగులు అందులో బెదిరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని, మెసేజ్ ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నామని ముంబయి పోలీసులు వెల్లడించారు. మరోవైపు, బాంద్రాలోని ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా.. సల్మాన్ఖాన్కు ఇలా బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇక, అంతకుముందు పన్వేల్ ఫామ్హౌస్లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. నటుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది.
ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీగతవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ హత్య తామే చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com