Bihar suicide: తల్లిదండ్రులు మందలించారని నలుగురు బాలికల ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో నలుగురు బాలికలు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన బీహార్లో చోటుచేసుకుంది. సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఐదో బాలిక ఇచ్చిన వాంగ్మూలంతో ఆలస్యంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఔరంగాబాద్ జిల్లా హస్పూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దళితవాడలో జనవరి 29న ఈ విషాదం జరిగింది. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలికలు అబ్బాయిలతో మాట్లాడుతున్నారని వారి కుటుంబసభ్యులు తీవ్రంగా మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఐదుగురు, ఊరి పొలాల్లోకి వెళ్లి సామూహికంగా విషం తాగారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక బాలిక ప్రాణాలతో బయటపడింది.
ఈ ఘటనపై స్థానిక మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు ఫిబ్రవరి 9న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, అప్పటికే మృతుల కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పకుండా మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేసి గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీంతో పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. గ్రామస్థులు కూడా దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు.
'ప్రాణాలతో బయటపడిన బాలిక ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. అబ్బాయిలతో మాట్లాడినందుకు వారి కుటుంబసభ్యులు మందలించడంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పింది' అని ఔరంగాబాద్ ఎస్పీ అంబరీష్ రాహుల్ పీటీఐకి తెలిపారు. ప్రస్తుతం ఆ ఒక్క బాలిక వాంగ్మూలమే తమకు కీలక ఆధారమని దౌద్నగర్ ఎస్డీపీవో అశోక్ కుమార్ దాస్ పేర్కొన్నారు. పరారీలో ఉన్న కుటుంబసభ్యుల కోసం గాలిస్తున్నామని, వారికి విషం ఎవరు సరఫరా చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
