భారీ బందోబస్తు మధ్య బీహార్లో ముగిసిన రెండో విడత పోలింగ్

భారీ బందోబస్తు మధ్య బీహార్లో రెండో విడత పోలింగ్ ముగిసింది. సెకండ్ ఫేజ్లో భాగంగా మహాగట్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, నితీష్ క్యాబినెట్లోని నలుగురు మంత్రులు, సినీ నటుడు శత్రఘ్నసిన్హా కుమారుడు లవ్సిన్హా పోటీ చేస్తున్న స్థానాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం మూడు దశల పోలింగ్లో ఎక్కువ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగింది ఈ సెకండ్ ఫేజ్లోనే. 17 జిల్లాలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. భద్రతా కారణాల వల్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
రెండోదశ ఎన్నికల్లో 94 సీట్లలో విపక్ష కూటమి తరపున 56 స్థానాల్లో ఆర్జేడీ, 24 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాలుగు స్థానాల చొప్పున, సీపీఐఎంఎల్ మరికొన్ని స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ 46 స్థానాల్లో, జేడీయూ 43 సీట్లలో, వీఐపీ 5 స్థానాల్లో పోటీ చేశాయి. ఎల్జేపీ 52 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. పాట్నాలోని దిఘాలో బీహార్ గవర్నర్ చౌహాన్, ఖగారియాలో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఓటువేశారు. మిగిలిన 77 నియోజకవర్గాలకు ఈనెల 7న మూడోదశలో పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 11న విడుదల కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com