Sonia Gandhi : సోనియా గాంధీతో శశిథరూర్ భేటి..

Sonia Gandhi : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీకి సిద్ధంగా ఉన్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్.. సోనియా గాంధీతో సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయాలకు శశిథరూర్ జై కొట్టిన తర్వాత ఈ భేటీ జరగడం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఉండాలంటూ రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలు తీర్మానాలు చేశాయి. అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలేయాలని ఎన్నికలు వద్దని మూడు రాష్ట్రాల పీసీసీలు తీర్మానించారు.
కొందరు నేతలు మాత్రమే గాంధీయేతర నాయకుడిని కోరుకుంటున్నారు. ఇందిలా భాగంగా కొద్దినెలల క్రితం ఉదయ్పూర్లో కాంగ్రెస్ చేసిన తీర్మానాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పార్టీకి చెందిన కొందరు యువ నాయకులు ట్విట్టర్లో ఓ పిటిషన్ను రూపొందించారు. దీనికి మద్దతుగా 650మంది పార్టీ నాయకులు సంతకాలు చేశారు. దీన్నే ట్విట్టర్లో షేర్ చేసి తాను స్వాగతిస్తున్నట్లు శశిథరూర్ తెలిపారు. మరోవైపు పార్టీలో సంస్కరణల కోసం డిమాండ్ చేసిన జీ-23 నేతల్లో ఈయన కూడా ఒకరు. ఈ విషయంపై 2020లోనే సోనియా గాంధీకి లేఖ రాశారు.
తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని థరూర్ కొద్దిరోజుల క్రితమే చెప్పారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నాయకుడు కాంగ్రెస్ పగ్గాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ను బరిలోకి దింపాలని సోనియా భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే శశిథరూర్ తప్పకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com