Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందంలోని ఆరుగురి దుర్మరణం

ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాపుర్ జిల్లాలో ఓ బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ఎస్పీ జ్ఞానంజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఏడుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 12 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరిని ఇంకా గుర్తించాల్సి ఉందని, అతడు బస్సు డ్రైవర్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ట్రక్కును రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏప్రిల్ 11న బిహార్లోని కతిహార్ జిల్లాలో జరిగిన ఇలాంటి ఘోర ప్రమాదంలో 10 మంది మరణించిన విషయం తెలిసిందే. జాతీయ రహదారి 31పై పికప్ వాహనం, బస్సు ఢీకొన్న ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. మృతులంతా ఝార్ఖండ్ నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న గిరిజనులు కావడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
