Manipur: మణిపూర్ లో కొనసాగుతున్న హింస

తాజాగా మణిపూర్‌ సీఎం కాన్వాయ్‌పై మిలిటెంట్ల కాల్పులు

మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరగడానికి ఆరు నెలల ముందు, భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి మూడుసార్లు లేఖ రాసిన విషయం బయటకు వచ్చింది. ఆదివారం మణిపూర్‌లోని జిరిబామ్‌లో అనుమానిత ఉగ్రవాదులు రెండు పోలీసు అవుట్‌పోస్టులు, అటవీ శాఖ బీట్ ఆఫీసు సహా 70కి పైగా ఇళ్లకు నిప్పు పెట్టారు. నిప్పంటించిన తర్వాత, అనుమానిత ఉగ్రవాదులు ఆయుధాలతో గ్రామాల్లో నిర్భయంగా తిరుగుతూ కనిపించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శనివారం ఉదయం ఇంఫాల్ నుండి జిరిబామ్‌కు మణిపూర్ పోలీసుల కమాండో బృందాన్ని విమానంలో తరలించారు. ఇతర జిల్లాల నుంచి భద్రతా బలగాలను రప్పించారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో బరాక్ నది ఒడ్డున ఉన్న ఛోటోబెకరా, జిరి పోలీసు పోస్టులకు ఉగ్రవాదులు నిప్పుపెట్టారు. లాంటై ఖునౌ, మోధుపూర్ ప్రాంతంలో చీకటిని ఉపయోగించుకున్న ఉగ్రవాదులు జిల్లా శివార్లలోని 70కి పైగా ఇళ్లను తగులబెట్టి అనేక దాడులకు పాల్పడ్డారు.మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపు దాడిలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు.

భద్రతను కట్టుదిట్టం

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన హింసాకాండలో ప్రభావితమైన ప్రజలు ఇప్పుడు భద్రత కోసం అస్సాంలోని కాచర్ జిల్లాకు తరలివెళ్లారు. జిల్లాలోని లఖీపూర్, జీరీఘాట్‌లలో ఎక్కువ మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. ఈ విషయాన్ని లఖిపూర్ ఎమ్మెల్యే కౌశిక్ రాయ్ సోమవారం తెలిపారు. శనివారం మణిపూర్‌లోని జిరిబామ్ ప్రాంతంలో జరిగిన హింసాకాండ తరువాత, జిల్లాలో దాదాపు 600 మంది ప్రజలు ఆశ్రయం పొందేందుకు వచ్చారని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుమల్ మహట్టో తెలిపారు. కాచర్-జిరిబాం జిల్లాతో సరిహద్దును పంచుకుంటుందని తెలిపారు. దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.


మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పుల నేపధ్యంలో జిరిఘాట్‌, సమీప గ్రామాల సరిహద్దుల్లోని జాతీయ రహదారిపై పోలీసులు పహారా కాస్తున్నారు. అసోంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆయన అన్నారు. జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున జిరిబామ్ జిల్లా యంత్రాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలను విధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ముఖ్యమైన ప్రభుత్వ ఆస్తులు, పత్రాలు మొదలైన వాటికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు జిరిబామ్ జిల్లాలోని అన్ని డిఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలని.. సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులను రక్షించాలని ఆదేశించారు

Tags

Next Story