
Uttar Pradesh: ఎవరికైనా పాము కరిసిందని తెలిస్తే ఆ విషం ఎక్కడ శరీరం అంతా పాకుతుందో అని హుటాహుటిన ఆస్పత్రికి పరిగెడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కరిచిన పామును గోనె సంచిలో బంధించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పామును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఉన్నావ్ జిల్లా సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని ఉమర్ అత్వా గ్రామంలో నివాసం ఉంటున్న నరేంద్ర భార్య కుస్మా తన ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము ఆమెను కాటువేసింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసి స్పృహతప్పి పడిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇరుగు పొరుగు వాళ్లు మహిళను వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఈ విషయం మహిళ భర్త నరేంద్రకు తెలియడంతో ఆయన ఇంటికి వెళ్లి పామును పట్టుకుని గోనె సంచిలో బంధించాడు. దానిని చూసి ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఖంగుతిన్నారు. పాముని ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించగా.. తన భార్యకు ఏ పాము కరిచిందో వైద్యుడికి చూపుతానని, తదనుగుణంగా ఆమెకు చికిత్స అందించగలుగుతారని చెప్పాడు. ప్రస్తుతం ప్రాణాపాయం నుండి బయటపడిన భార్యను నరేంద్ర ఇంటికి తీసుకుని వెళ్లారు. అటవీ శాఖ అధికారులకు వైద్యులు సమాచారం అందించడంతో వారు వచ్చి పామును అడవిలో వదిలేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com