Sonia Gandhi: విపక్షాలకు సోనియా విందు

Sonia Gandhi: విపక్షాలకు సోనియా విందు
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల భేటీకి సోనియా

ప్రతిపక్ష పార్టీలకు విందుకు ఆహ్వానించారు సోనియా గాంధీ (Sonia Gandhi). జులై 17, 18 న బెంగ‌ళూర్‌లో జ‌రిగే విప‌క్ష పార్టీల త‌దుప‌రి స‌మావేశానికి సోనియా హాజరుకానున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశనికి రావలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీతో సహా 24 పార్టీలకు పిలుపునిచ్చారు. 2024 లో జరిగే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై కలిసి పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలను కూడగట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది.

ఎన్డీయేయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన నేతృత్వంలో గత నెల 23న పాట్నాలో జరిగిన సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మమత బెనర్జీ, తదితరులు హాజరయ్యారు. మొత్తం 17 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కొనాలని ఈ పార్టీలు నిర్ణయించాయి తమ మధ్య విభేదాలను పక్కనబెట్టి, ఇచ్చి, పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని, ఉమ్మడి ఎజెండాతో, రాష్ట్రాలవారీ వ్యూహాలతో బీజేపీని ఎదుర్కొంటామని తీర్మానించాయి.


ఇక బెంగళూరులో జరగనున్న రెండో సమావేశానికి కొత్తగా ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. వీటిలో కేడీఎంకే, ఎండీఎంకే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మిత్ర పక్షాలుగా ఉండేవి.

ఈ సమావేశాలకు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఆహ్వానం పంపించారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ వైఖరి ఆమ్ ఆద్మీ పార్టీ కి అనుకూలంగాలేదు. దీంతో ఢిల్లీ ఆర్డినెన్స్‌కు కాంగ్రెస్ బహిరంగ మద్దతు ప్రకటించే వరకు భవిష్యత్తులో తాము ఇటువంటి సమావేశాల్లో పాలుపంచుకోవడం కష్టమవుతుందని ఆ పార్టీ తెలిపినట్టుగా సమాచారం. మరోవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

24 రాజకీయ పార్టీల మధ్య విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం రావడం కోసం ఈ సమావేశాల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశాలు జూలై 13న జరగవలసి ఉంది, కానీ ఎన్‌సీపీలో చీలిక రావడంతో జూలై 17కు వాయిదా వేశారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలతోపాటు టీడీపీకి ఆహ్వానం అందిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story