Chandigarh Polls: రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌పై సుప్రీం సీరియ‌స్‌

Chandigarh Polls: రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌పై సుప్రీం సీరియ‌స్‌
బ్యాలెట్‌ పేపర్లపై ఎక్స్ మార్క్ ఎందుకు పెట్టారంటూ ప్రశ్న

చండీగఢ్ మేయర్ ఎన్నిక తీవ్ర దుమారం రేపుతోంది. గత నెల 30 వ తేదీన జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం కోర్టుకు ఎక్కడంతో.. విచారణ జరిపిన సీజేఐ.. రిటర్నింగ్ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చండీఘ‌డ్ మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో బ్యాలెట్ పేప‌ర్ల‌పై రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ అనిల్ మాషి టిక్కు మార్కులు పెట్టిన అంశం వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఈ విషయంపై చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్యాలెట్ పేప‌ర్ల‌ను లెక్కించాల్సిన స‌మ‌యంలో.. వాటికిపై x మార్క్ టిక్కులు ఎందుకు పెట్టిన‌ట్లు రిటర్నింగ్ ఆఫీస‌ర్‌ను చీఫ్ జ‌స్టిస్ అడిగారు. ఒక‌వేళ కోర్టుకు ఏదైనా అబ‌ద్దం చెప్పాల‌ని రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ప్ర‌య‌త్నిస్తే ఆయ‌న్ను కూడా విచారించ‌నున్న‌ట్లు సీజే వార్నింగ్ ఇచ్చారు. కెమెరా వైపు చూస్తూ ఎందుకు టిక్కు మార్కులు పెట్టావ‌ని సీజే ప్ర‌శ్నించారు.

కోర్టు విచార‌ణ‌కు హాజ‌రైన అనిల్ మాషి.. సీజే ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ.. దెబ్బ‌తిన్న బ్యాలెట్ పేప‌ర్ల‌కు మార్కింగ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఆ స‌మ‌యంలోనే కౌంటింగ్ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాను చూసిన‌ట్లు తెలిపారు. మొత్తం 8 బ్యాలెట్ పేప‌ర్ల‌పై మార్కింగ్ చేసిన‌ట్లు చెప్పారు. అయితే వాటిని వేరు చేయాల‌న్న ఉద్దేశంతో అలా చేసినట్లు తెలిపారు. కానీ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ఇచ్చిన స‌మాధానంతో సీజే సంతృప్తి చెంద‌లేదు. బ్యాలెట్ పేప‌ర్ల‌ను లెక్కించాలి, కానీ టిక్కులు పెట్ట‌డం దేనికి, ఏ రూల్ ప్ర‌కారం అలా చేశార‌ని, ఆర్ఓను ప్రాసిక్యూట్ చేయాల‌ని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని చోటు లేద‌ని సీజే అన్నారు.

చండీఘ‌డ్ మేయ‌ర్ ఎన్నికపై స్టే ఇవ్వాల‌ని కోరుతూ ఆప్ కౌన్సిల‌ర్ కుల్దీప్ కుమార్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ కేసును విచారించింది. ఆ ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి మేయ‌ర్‌గా ఎన్నికైన విష‌యం తెలిసిందే. అయితే మేయ‌ర్‌గా ఎన్నికైన వ్య‌క్తి ఆదివారం త‌న ప‌దవికి రాజీనామా చేశారు. మ‌రో వైపు ముగ్గురు ఆప్ కౌన్సిల‌ర్లు బీజేపీలో చేరారు.హార్స్ ట్రేడింగ్ జ‌రుగుతున్న అంశంపై సీజేఐ డీవై చంద్ర‌చూడ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అభ్య‌ర్థులు పార్టీలు మార‌డం క‌లిచివేస్తోంద‌న్నారు.


Tags

Read MoreRead Less
Next Story