Supreme Court: ప్రశాంత్ కిషోర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ తీరుపై చీవాట్లు

Supreme Court: ప్రశాంత్ కిషోర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ తీరుపై చీవాట్లు
X
జన్ సురాజ్ పార్టీ పిటిషన్ తిరస్కరణ

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన 'జన్ సురాజ్' పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేసి, కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పాట్నా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ, పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. జన్ సురాజ్ తరఫున సీనియర్ న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ వాదనలు వినిపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' కింద మహిళలకు రూ.10,000 చొప్పున పంపిణీ చేసిందని, ఇది ఓటర్లను ప్రలోభపెట్టడం, లంచం ఇవ్వడం కిందకే వస్తుందని ఆరోపించారు. తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న బీహార్‌లో ఇలాంటి పథకం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు.

ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. "మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రజలు తిరస్కరించిన తర్వాత ఉపశమనం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా?" అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ పథకంపై అభ్యంతరం ఉంటే సరైన సమయంలోనే సవాల్ చేయాల్సిందని అభిప్రాయపడింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది.

దేశవ్యాప్తంగా ఉచిత పథకాలపై దాఖలైన ఇతర పిటిషన్లపై విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసిన ధర్మాసనం, ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ వేసిన ఈ పిటిషన్‌ను మాత్రం విచారించలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్ సదుద్దేశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది పాట్నా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరగా, ధర్మాసనం అంగీకరించింది.

Tags

Next Story