Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు: కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు:   కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
X
బతకాలో, చావాలో చెప్పడానికి మనమెవరం..సుప్రీంకోర్టు తీర్పు

దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. అతడు కోలుకునే అవకాశం లేదని వైద్యులు ధ్రువీకరించారని, మానవీయ కోణంలో మర్యాదపూర్వక చావును ప్రసాదించాలని వారు కోర్టును వేడుకున్నారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఒకింత ఆవేదన వ్యక్తంచేసింది. ‘‘ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని మేం ఉపయోగించలేం. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం. మేమూ మనుషులమే. ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించింది.

ఎవరీ హరీశ్‌ రాణా..?

దిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా, ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి అతడు కోమాలోనే ఉండిపోయాడు.

ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి హరీశ్‌ను చూసుకుంటున్నారు. కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్‌ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో అతడి కుటుంబం మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెడికల్‌ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Tags

Next Story