Supreme Court: సీఈసీ నియామకం పిటిషన్లుపై నేడు విచారణ

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ వ్యతిరేకంగా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లతో పాటు 2023 చట్టం ప్రకారం సీఈసీ, ఈసీల నియామకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 19న ‘‘ప్రాధాన్యత ప్రాతిపదికన’’ విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
సీఈసీ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహా పలు సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించనున్నారు. 2023లో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సీఈసీ నియామకంలో పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సీఈసీ, ఈసీల ఎంపిక, నియామకాలు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ద్వారా జరుగుతాయని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. తాజాగా జరిగిన సీఈసీ నియామకం ఆ పద్ధతిలో జరగకపోవడంతో సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ సోమవారం నియమితులయ్యారు. న్యాయ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని ఇచ్చింది. జ్ఞానేష్ కుమార్.. పదవీకాలం జనవరి 26, 2029 వరకు ఉంటుంది. వచ్చే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా ఈయన ఆధ్వర్యంలోనే విడుదల కావొచ్చు. బుధవారం సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com