Drushyam Movie crime: పోలీసులకు దృశ్యం చూపించింది

Drushyam Movie crime: పోలీసులకు దృశ్యం చూపించింది
ప్రియుడి కోసం కన్న బిడ్డని చంపుకున్న తల్లి

సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం.. అవునన్నా కాదన్నా ఇది నిజం. కొన్ని సినిమాలు చూశాక వాటి నుంచి మంచి విషయాలు గ్రహించి స్ఫూర్తి పొందుతాం. కానీ కొంతమంది మాత్రం సినిమాల్లోని మంచి విషయాన్ని పక్కనపెట్టి చెడు విషయాల నుంచి స్ఫూర్తి పొందుతారు. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. అన్ని భాషల్లో సూపర్ హిట్ కొట్టిన "దృశ్యం’’ సినిమాను చూసిన ఓ మహిళ తన రెండున్నరేళ్ల కొడుకును చంపేసింది.

ఝార్ఖండ్ కు చెందిన నయన మాండవి అనే మహిళ సూరత్ లోని దిండోలి ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్త చనిపోయాడు. ఆమెకు వీర్ మాండవి అనే రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. జూన్ 27న తన కొడుకు కనిపించడం లేదని నయన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. నయన మాండవి పని చేసే స్థలంలో ఉన్న సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. కానీ సీసీటీవీ పుటేజీలో చిన్నారి సైట్ నుంచి బయటికి వెళ్లినట్టు కనిపించలేదు. డాగ్ స్క్వాడ్‌ను కూడా బరిలోకి దించినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు నయనను ప్రశ్నించగా మాటల్లో తనకు ఒక ప్రేమికుడు ఉన్నాడని బయట పెట్టింది. జార్ఖండ్‌లో ఉంటున్న తన ప్రేమికుడే తన బిడ్డను కిడ్నాప్ చేసి ఉంటాడని ఆరోపించింది. దీంతో పోలీసులు నయన ప్రేమికుడిని విచారించారు. కానీ అతను తానెప్పుడు సూరత్ కు రాలేదని చెప్పాడు. పోలీసులకు కూడా అతను సూరత్ వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు.




నయనపై పోలీసుల అనుమానం మరింత బలపడడంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించిన నయన.. మృతదేహాన్ని ముందు నీళ్లబావిలో పడేశానని, ఆ తర్వాత గొయ్యి తీసి పూడ్చానని చెప్పింది. ఆ ఆనవాళ్లేమి లేకపోవడంతో ఈసారి మరింత గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం చెప్పింది. మరుగుదొడ్డికోసం తీసిన గుంతను తవ్వి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. అసలు కన్న బిడ్డను ఎందుకు చంపావని పోలీసులు ప్రశ్నించగా సదరు మహిళ చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. తన ప్రేమికుడు తనను అంగీకరిస్తాడు కానీ బిడ్డను ఒప్పుకోలేదని అందుకే బిడ్డను చంపేశానని, తర్వాత ఎవరికీ దొరకకుండా శవాన్ని దాచిపెట్టడానికి దృశ్యం సినిమా చూసినట్లు తెలిపింది.

ఆ సినిమాలో హీరో శవాన్ని కనపడకుండా చేసి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. దీంతో తాను కూడా దృశ్యం సినిమా మాదిరిగానే శవాన్ని దాచిపెట్టడం ద్వారా పోలీసులు పట్టుకోలేరని భావించి ఇలా చేసినట్టు తెలిపింది. ఆ తర్వాత తన ప్రియుడి దగ్గరకు వెళదామని ప్లాన్ వేసుకున్నానని, అందుకే శవం ఎక్కడ ఉంది అనే విషయంలో మొదట అబద్దం చెప్పినట్టు నయన మాండవి ఒప్పుకుంది. కాగా ప్రస్తుతం నయన మాండవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story