Susanth Singh Rajput: మహారాష్ట్ర డిప్యూ సీఎం ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

మూడేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2020లో చనిపోయిన ఈ హీరో కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా సుశాంత్ మరణం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసుపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను సేకరించినట్లు వెల్లడించారు. ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు గురించి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ కేసులో తొలుత ఉన్న సమాచారం వాళ్లూ వీళ్లు చెప్పిన మాటల ఆధారంగానే ఉందని... కానీ, ఆ తర్వాత కొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారని.. దానిపై తాము చర్యలు చేపట్టామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని ఇప్పటికే కోరామన్నారు. కేసులో ప్రాథమిక సాక్ష్యాలను సేకరించామని.. ప్రస్తుతం వాటి విశ్వసనీయతను అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. సుశాత్ మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని... ఈ దశలో తాను కేసు గురించి ఏం చెప్పలేనని ఫడ్నవీస్ వెల్లడించారు.
2020 జూన్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబయిలోని తన అపార్ట్మెంట్లో మరణించారు. ఆయన మృతి బాలీవుడ్తో సహా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను షాక్కు గురిచేసింది. తొలుత ఆయనది ఆత్మహత్య అని వార్తలు వచ్చాయి. అయితే సుశాంత్ మృతిలో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించగా.. అప్పటినుంచి దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, మూడేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లభించకపోవడం అనుమానాలకు తావిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు సుశాంత్ మరణానికి వారం రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com