Swati maliwal: స్వాతి మాలీవాల్ దాడి కేసులో బిభవ్ అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ..... స్వాతి మాలీవాల్పై దాడి కేసులో కీలక పరిణామాలు సంభవించాయి. మాలీవాల్ కేసులో ప్రధాన నిందితుడు బిభవ్కుమార్ను... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాలీవాల్పై ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని... వైద్య బృందం ఇచ్చిన నివేదిక వెల్లడించింది. మరోవైపు కేజ్రీవాల్ నివాసం నుంచి స్వాతి మాలీవాల్ బయటకు వస్తున్న దృశ్యాలను ఆప్.. విడుదల చేసింది. మాలివాల్పై జరిగిన దాడి ఘటనపై ఆప్-భాజపా మధ్య మాటల తూటాలుపేలుతున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు, దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ను...పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాతి మలీవాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 13న ఆమెపై దాడి జరగ్గా...3రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 506, 509, 323 ప్రకారం ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన పోలీసులు...దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీఎయిమ్స్లో స్వాతి మాలీవాల్కు వైద్యపరీక్షలు నిర్వహించగా...అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈనెల 16వ తేదీ రాత్రి స్వాతి మాలీవాల్ను పరిశీలించిన తర్వాత వైద్యబృందం ఓ నివేదిక సమర్పించింది. ఆమె ఎడమకాలు, కుడి చెంపతోపాటు కుడి కన్ను కింద గాయాలు ఉన్నాయని వైద్యనివేదిక బయటపెట్టింది. దాదాపు 3గంటలపాటు వైద్యపరీక్షలు చేసిన అనంతరం ముఖంపై గాయాలతోపాటు శరీరంపై పలుచోట్ల గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు.
స్వాతి మాలీవాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈనెల 17న స్వాతిని సీఎం కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు... అదనపు డిప్యూటీ కమిషనర్ అజింత చెప్యాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు సీసీటీవీ పుటేజీ సేకరించారు. మాలివాల్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు...విచారణ హాజరుకావాలని జాతీయ మహిళా కమిషన్ మరోమారు బిభవ్కుమార్కు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ నివాసం నుంచి స్వాతీ మలీవాల్ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సీఎం నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. ఈ సందర్భంగా సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేసినట్లు ఉంది.
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణలపై ఆప్ ఘాటుగా స్పందించింది. భాజపాకు ఆమె తొత్తుగా మారారని దిల్లీ మంత్రి అతిషీ...ఆరోపించారు. అపాయింట్ మెంట్ లేకుండా ఈనెల 13న కేజ్రీవాల్ నివాసానికి వచ్చిన ఆమె.... అక్కడున్న భద్రతాసిబ్బందిని బెదిరించారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి లీక్ అయిన సీసీటీవీ ఫుటేజీ గురించి ప్రస్తావించిన అతిషి ...మాలీవాల్ భద్రతాసిబ్బందితో వాగ్వాదానికి దిగడం స్పష్టంగా కన్పిస్తోందన్నారు. స్వాతి మాలివాల్ చెప్పేవన్నీ అబద్ధాలని తిప్పికొట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ కూడా స్వాతిమాలీవాల్పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com