TASMAC: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఖాళీ బాటిల్ ఇస్తే డబ్బులు ఎక్కడంటే ?

తమిళనాడులో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఖాళీ మద్యం బాటిళ్ల కొనుగోలు (బై-బ్యాక్) పథకం చెన్నైలో ఈ వారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. గతంలో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవడంతో ఈ పథకాన్ని నగరంలో తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, పకడ్బందీ ఏర్పాట్లతో దశలవారీగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) నిర్ణయించింది.
ఈ పథకం కింద, మద్యం కొనుగోలు చేసేటప్పుడు ప్రతి బాటిల్పై కస్టమర్ల నుంచి అదనంగా రూ.10 వసూలు చేస్తారు. ఆ ఖాళీ బాటిల్ను తిరిగి నిర్దేశిత టాస్మాక్ దుకాణంలో లేదా కలెక్షన్ పాయింట్లో అప్పగిస్తే, ఆ రూ.10 మొత్తాన్ని వినియోగదారులకు వాపసు ఇస్తారు. మొదట కొండ ప్రాంతాల్లో విసిరేసిన మద్యం సీసాల వల్ల ఏనుగులు వంటి వన్యప్రాణులకు గాయాలవుతున్నాయని భావించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు.
అయితే, చెన్నైలో అమలు చేసే సమయంలో టాస్మాక్ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ బాటిళ్లను సేకరించడానికి, నిల్వ చేయడానికి సరైన సౌకర్యాలు లేవని, ఇప్పటికే ఉన్న సిబ్బందిపై పని భారం అధికమవుతుందని ఆరోపిస్తూ దుకాణాలు మూసివేసి ఆందోళన చేపట్టారు. దీంతో పథకం అమలు నిలిచిపోయింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు కూడా స్పందించి, ఫిబ్రవరి నెలాఖరు నాటికి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని టాస్మాక్ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, గతంలో ఉత్తర, మధ్య, దక్షిణ చెన్నై జిల్లాల్లో ఒకేసారి పథకాన్ని అమలు చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఈసారి అలా కాకుండా వారం రోజుల్లో దశలవారీగా మూడు జిల్లాలను కవర్ చేస్తామని ఓ సీనియర్ టాస్మాక్ అధికారి తెలిపారు. అయితే, తమ డిమాండ్లు మారలేదని, ఈ పథకం అమలుకు ప్రత్యేక ఏజెన్సీని నియమించాల్సిందేనని ఏఐసీటీఈ అనుబంధ టాస్మాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ధనశేఖరన్ స్పష్టం చేశారు. ఉద్యోగుల అభ్యంతరాల నడుమ, టాస్మాక్ ఈ పథకాన్ని ఎంతవరకు విజయవంతంగా అమలు చేస్తుందో వేచి చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
