West Bengal : బెంగాల్ రాజకీయాల్లో అగ్గిరాజేసిన టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్..

West Bengal : పశ్చిమబెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. అవినీతిని బయటపెడతామంటూ ఈడీ దూసుకువెళ్తోంది. ఇదీ ముమ్మాటికి కేంద్రం ఆడిస్తున్న ఆట అంటూ మమత ప్రభుత్వం ఆరోపిస్తోంది. అసలు పశ్చిమబెంగాల్ లో ఏం జరుగుతోంది. మంత్రి సహాయకురాలు ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు ఎక్కడివి. అదంతా మంత్రి సొమ్మేనా?
పశ్చిమబెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ప్రకపంనలు సృష్టిస్తోంది. మంత్రి పార్థ చటర్జీ అరెస్ట్తో బెంగాల్ రాజకీయాల్లో అలజడి మొదలైంది. ఇది ముమ్మాటికి కేంద్రం ఆడిస్తున్న ఆట అంటూ తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా ఉన్న పార్థ చటర్జీ.. 2014- నుంచి 2021 వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో టీచర్ రిక్రూట్మెంట్లో భారీ స్కాం జరిగింది.
గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టులతో పాటు గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తుచేస్తోంది. ఎంతమేరకు డబ్బులు మారాయన్న దానిపై ఈడీ ఎంక్వయిరీ చేస్తోంది.
టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈడీ తనిఖీలు చేపట్టింది. మంత్రులు పార్థ చటర్జీ, పరేష్ అధికారి ఇండ్లల్లో అలాగే పార్థ చటర్జీ అనుచరులు అర్పితా ముఖర్జీ ఇంట్లోనూ రైడ్స్ జరిగాయి. ఈ సోదాల్లో అర్పిత ఇంట్లో రూ. 20 కోట్ల నగదు, కోటి విలువ జేసే బంగారు అభరణాలు, 20 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు ఈడీ అధికారులు.
ఈడీ విచారణలో మంత్రి పార్థ ఛటర్జీకి సంబంధించిన ఆక్రమాస్తులు బయటపడ్డాయి. కోల్కతాలో ఖరీదైన డైమండ్ సిటీలో మంత్రికి మూడు ఫ్లాట్ లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఒకటి కుక్కుల కోసమే కేటాయించినట్టు తెలుస్తోంది.
పార్థ ఛటర్జీ అరెస్ట్ సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అరెస్టైన పార్థ ఛటర్జీ అనారోగ్య కారణాలవల్ల కోల్కతాలోని SSKM హాస్పిటల్లో చేరారు. కానీ ED అధికారులు హుటాహటిన ఆయనను కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈఎస్ఐ అప్పత్రికి తరలించారు. అన్ని పరీక్షలు చేయించిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించి రెండు రోజుల రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అయిన సమయంలో పార్థ ఛటర్జీ మమత బెనర్జీకి మూడు సార్లు ఫోన్ కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. అదంతా అబద్ధమని టీఎంసీ నాయకులు కొట్టిపారేస్తున్నారు.
మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత ఎట్టకేలకు సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకీ మరోసారి థమ్కీ ఇచ్చారామె. రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిపోయిన బీజేపీకి భయపడేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు దీదీ. అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బీజీపీపై సీఎం మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ పశ్చిమబెంగాల్ కు రావాలంటే బంగాళాఖాతం దాటి రావాలి. మీరు ఇక్కడకు వచ్చేలోపే మొసళ్లు కొరుక్కుతినేస్తాయ్.. రాయల్ బెంగాల్ టైగర్లు దాడి చేస్తాయి.. ఏనుగులు తొక్కిపడేస్తాయి జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు మమత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com